అమరావతి: మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు 12వ రోజుకు చేరాయి. ఆదివారం రైతుల ఆందోళనలో అపశృతి చోటు చేసుకుంది. మందడంలో రైతుల దీక్షా శిబిరం వద్ద పోలీసు వాహనం ఢీకొని ఓ టెంట్ కూలింది. ఈ ఘటనలో ఓ రైతుకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ విజయవాడ బెంజ్సర్కిల్లో ఆదివారం ఉదయం మానవహారం నిర్వహించారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. సేవ్ అమరావతి నినాదంతో హైస్కూల్ రోడ్డు నుంచి విజయవాడ బెంజ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు మాట్లాడుతూ మూడు రాజధానుల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని మండిపడ్డారు. రాజధాని అభివృద్ధి కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. రాజధాని పోరాటంలో రైతులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయచ్చు కానీ, పాలనను వికేంద్రీకరణ చేయడం మంచిది కాదని తెలిపారు. అమరావతిలోనే రాజధాని ఉంటుందని ప్రకటన చేసే వరకు తమ ఉద్యమం ఆగదని సమితి నేతలు స్పష్టం చేశారు.