తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటి నుండే పార్లమెంట్ అభ్యర్ధుల ప్రకటన చేస్తున్నారు. ప్రస్తుతం రాయలసీమ పర్యటన చేస్తున్న చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలోనే ఇద్దరు లోక్సభ అభ్యర్ధులను ప్రకటించారు చంద్రబాబు. కడప, రాజంపేట పార్లమెంట్ అభ్యర్ధులను చంద్రబాబు ప్రకటించారు. కడప పార్లమెంట్ అభ్యర్ధిగా శ్రీనివాసరెడ్డి, రాజంపేట లోక్ సభ అభ్యర్ధిగా గంటా నరహరి పేర్లను చంద్రబాబు ప్రకటించారు. వీరు ఇద్దరు రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పిన చంద్రబాబు.. వీరు తమ నియోజకవర్గ పరిధిలో పర్యటించి నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇద్దరు అభ్యర్ధులకు అందరూ సహకరించాలని కోరారు.
శ్రీనివాసరెడ్డి ఇప్పటికే కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజంపేటకు చెందిన గంటా నరహరి బెంగళూరు కేంద్రంగా వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. గత వారమే గంటా నరహరి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. 2017 -18 లో రాష్ట్రపతి నుండి ఉత్తమ యువ పారిశ్రామికవేత్తగా అవార్డు అందుకున్నారు గంటా నరహరి. నరహరి రాజకీయాలకు కొత్తే కానీ ఆయన కుటుంబం చాలా కాలం నుండి రాజకీయాల్లో కొనసాగుతోంది. దివంగత ఎంపి ఆదికేశవులు నాయుడు సతీమణి సత్యప్రభ సోదరి అల్లుడు నరహరి. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన సత్యప్రభ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో మరణించారు. ఈ నేపథ్యంలో సత్యప్రభ స్థానంలో పోటీ చేసేందుకు నరహరిని టీడీపీ ఆహ్వానించింది. దీంతో ఆయన ఇటీవల టీడీపీలో చేరారు.