TDP: ఏపిలో వైసీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత టీడీపీకి తీరని కష్టాలు వచ్చి పడ్డాయి. ఒక నాడు టీడీపీకి వెన్నుదన్నుగా నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనం అయ్యారు. ఆ తరువాత నలుగురు ఎమ్మెల్యేలు అనధికారికంగా అధికార వైసీపీ గూటికి చేరిపోయారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసే టీడీపీ ముఖ్యనేతలపై కేసుల బనాయింపు, అరెస్టులతో గతంలో పార్టీ అంటే చొక్కాలు చించుకునే వారిలో సైతం కొందరు సైలెంట్ అయిపోయారు.
ఈ రెండేళ్లలో ప్రభుత్వ విధానాలపై పోరాటాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి బలం పెంచుకోవాలన్నా ఆ అవకాశాన్ని కరోనా మహమ్మారి ఇవ్వలేదు. గత ఏడాదితో పాటు ఈ ఏడాది కరోనా మొదటి దశ, రెండవ దశ విజృంభణతో ఆందోళనలు చేసే అవకాశమే టీడీపీకి చిక్కడం లేదు. పొరబాటున ఎక్కడైనా పది మంది టీడీపీ నేతలు కలిస్తే కోవిడ్ నిబందనలు అతిక్రమించారంటూ పోలీసులు కేసులు పెట్టేస్తున్నారు. దీంతో ఇటీవల కాలం వరకూ టీడీపీ బహిర్గతంగా ఉద్యమాలు చేసే పరిస్థితి కనబడలేదు. టీడీపీలో ఇంకా నైరాస్యం వీడకపోవడంతో మళ్లీ అధికార పార్టీకి వలసలు జరుగుతున్నాయి.
ఇటీవల విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శోబా హైమవతి టీడీపీకి రాజీనామా చేశారు. ఇప్పటికే ఆమె కుమార్తె వైసీపీలో యాక్టివ్ గా ఉన్నారు. అయితే శోభా హైమవతి వైసీపీలో చేరతారా లేక రాజకీయాలకు దూరంగా ఉంటారా అనేది ఇంకా తెలియలేదు. పార్టీలో సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదని ఆరోపణలు చేస్తూ శోభా హైమవతి పార్టీకి రాంరాం చెప్పారు. ఇక తాజాగా గుంటూరు జిల్లాకు మరో మాజీ ఎమ్మెల్యే కూడా టీడీపీకి గుడ్ బై చెప్పారు. గుంటూరు మాజీ ఎమ్మెల్యే జియాఉద్దీన్ మంగళవారం (నేడు) ఏపి సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు.