(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ఒక సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ముగిసింది. తెలుగు జర్నలిజాన్ని కొత్తపుంతలు తొక్కించిన ఈనాడు దినపత్రిక చీఫ్ ఎడిటర్ రామోజీరావు ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్కు సంపాదక బాధ్యతలు ఈనాడు జర్నలిజం స్కూలు ప్రిన్సిపాల్ ఎం నాగేశ్వరరావుకు, తెలంగాణ ఎడిషన్ బాధ్యతలు ఈనాడు డైరక్టర్ డిఎన్ ప్రసాద్కు అప్పగించారు.
83 ఏళ్ల రామోజీరావు వయోభారం వల్ల ఈ బాధ్యతల నుంచి తప్పుకున్నారని అనుకోవచ్చు. వయోభారంతో పాటు కొంతకాలం నుంచీ ఆయన ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగా ఉంది. కొన్నాళ్ల క్రితం రామోజీరావు గుండెకు బైపాస్ ఆపరేషన్ జరిగింది. అప్పటినుంచే ఆయన పనిభారం తగ్గించుకున్నారు. దానికి తోడు రామోజీరావు చిన్న కుమారుడు సుమన్ 2017లో కాన్సర్తో మరణించారు. ఈ పరిణామం రామోజీరావును కుంగదీసింది.
ఈనాడు సంపాదక బాధ్యతల నుంచి రామోజీరావు పూర్తిగా తప్పుకోవడానికి ఇన్ని కారణాలు ఉన్నప్పటికీ ఆయన బాధ్యతలను వేరేవారికి అప్పగించారన్న వార్త రాగానే ఎందుకు ఇలా జరిగిందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. దానికి కూడా కారణం లేకపోలేదు. మీడియాపై కేసులు పెట్టేందుకు ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2430 జీవో తీసుకువచ్చిన కారణంగా దానికీ దీనికీ లింకు ఉందేమోనన్న ఊహాగానాలు సహజంగానే ప్రారంభమయ్యాయి.
దినపత్రికలలో ప్రచురించిన వార్తలకు సంపాదకుడే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏదన్నా వార్తకు సంబంధించి పత్రికపై కేసు వేసిన పక్షంలో సంపాదకుడే కోర్టుకు హాజరు కావాలి. తనకు గిట్టని పత్రికలపై 2430 జీవో ప్రకారం ఇక జగన్ కేసులు వేయిస్తారనీ, ఈ వయసులో తాను కోర్టుల చుట్టూ తిరగడం కష్టం కాబట్టి రామోజీరావు సంపాదక బాధ్యతల నుంచి తప్పుకున్నారనీ అంటున్నారు. రామోజీరావు రిటైర్మెంట్ వార్తకు సోషల్ మీడియాలో పెద్దఎత్తున స్పందన వచ్చింది. ఆయన తప్పుకోవడానికి కారణాలు ఏమైఉండవచ్చన్న ఊహాగానాలు ఎక్కువగా చలామణీ అయ్యాయి.