తెలుగు న్యూస్ యాంకర్లు – ఆడవారు అయినా, మగవారు అయినా కోటు ధరించడం అనేది ఒక నియమం అయిపోయింది. ఢిల్లీ వంటి చోట చలికాలంలో కోటు తప్పనిసరి కావచ్చు. నిజానికి మనకు కనబడేది వేరు, న్యూస్ రీడర్ పరిస్థితి వేరు. ఎందుకంటే వార్తలు చదివివే సమయంలో కెమెరా వెలుగులు, వాటికి అవసరమైన మరికొన్ని లైట్లు ఉంటాయి. వాటిని కూడా భరించాల్సి వుంటుంది. దూరదర్శన్ మాత్రమే వార్తలు ఇస్తున్న కాలంలో, ఛానళ్ళు రాని కాలంలో – న్యూస్ రీడర్లు అందరూ కోట్లు వేసుకున్న దాఖలాలు లేవు. కొందరు కోట్లు, కొందరు జుబ్బాలు ఇలా వుండేది న్యూస్ రీడర్ల ఆహార్యం. టీవీ-9 రాకతో కోటు వేసినవారే వార్తా చదువరి అనే అప్రకటిత నియమం ఛానళ్ళలో కనబడేది. తొలిదశలో టీవీ-9 న్యూస్ బులెటన్లలో, టై కట్టుకోవడం, కోటు వేసుకోవడం, బొత్తాలు వేసుకోవడం – ఇలా వుండేది. వార్తలకూ, కోటుకు సంబంధం ఏమిటనే ప్రశ్న కలిగేది కూడా!
తీన్మార్ వార్తలు (వి6), టింగురంగ వార్తలు (99 టివి ?) కబ్బీరు ముచ్చట్లు (?), జులకటక వార్తలు (10టీవీ) మాస్ మల్లన్న (టీవీ-5) – చూస్తుంటే తెలుగు టీవీ వార్తల యాంకర్లు కోట్లు, కమామిషు గుర్తుకు వచ్చింది. వీటికి పోటీగా అన్నట్టు ఎన్టీవీ ‘ఎట్టెట్టా’ అని ఇటీవల రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభించింది.ఈ ప్రోగ్రాంలలో యాంకర్ల ఆహార్యం ప్రధాన ఆకర్షణ. ఎవరికీ కోటు, బూటు, టై ఉండదు. డై ఉండవచ్చు. రెండోది భాష. ఈ ప్రోగ్రాంలు అన్నింటినీ ఒక గాటన కట్టలేము. అయితే ప్రధాన స్రవంతి పోకడకు పూర్తిగా విభిన్నం కనుక ఈ ప్రస్తావన. తీన్మార్ వార్తలలో సావిత్రి చక్కగా స్థానిక, గ్రామీణ స్త్రీ ధరించే దుస్తులలో కనబడుతుంది. అపుడపుడు కనిపించే పద్మ కూడా స్థానిక ఆహార్యంతో నిండుగా, చురుగ్గా ఉంటుంది. ఇక బిత్తిరిసత్తి గెటప్, యాస, వ్యవహారం ప్రత్యేకం. సత్తి కాసేపే కనబడినా ఈ ప్రోగ్రాంకు ఆయనే హీరో. ఈ కారక్రమం ప్రొడ్యూసర్లు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి సత్తి ఐటమ్ రూపొందిస్తున్నారు. ఆ కుర్రాడు కూడా చాలా నేర్పుగా పండిస్తున్నాడు. అందులో పుష్కలంగా వ్యంగ్యం, హాస్యం అందుతోంది వీక్షకులకు. లేకపోతే బోరు కొట్టి తేలిపోయే ప్రమాదం వుంది. కనుకనే వాయిస్ ఓవర్ ఇచ్చే పద్మ కూడా ఇటీవల ప్రతి బులెటిన్లో రక్తి కట్టిస్తోంది.
ఇంకా పేరులో విభిన్నంగా ఉండి, ఆసక్తి కట్టించే మరో బులెటిన్ టింగురంగ వార్తలు. ఇందులో మెయిన్ యాంకర్ పేరు గమనించలేదు కానీ ప్రెజంటేషన్, అందులోని అమాయకత్వం, ఆవిడ ఆహార్యం – బావుంటున్నాయి. ఈ కార్యక్రమంలో కనబడే మేల్ రిపోర్టర్ కూడా శక్తివంచన లేకుండా చేస్తున్నాడు. కబ్బీరు ముచ్చట్లలో మెయిన్ ఫీమేల్ యాంకర్ పల్లెపడుచుగా కనబడితే, జులకటకలో ప్రథాన మహిళా యాంకర్ పాంట్, షర్ట్తో బస్తీమే సవాల్ అన్నట్టు ఉంటుంది. జులకటకలో మేల్ రిపోర్టర్ గోచి, బనియను, గొంగళిలో ఫక్తు గ్రామీణ ఆహార్యంలో ఉంటారు. ఈ ఆహార్యానికి టీవీ-5 మాస్ మల్లన్న యాంకర్కు ఆహార్యంలో బాగానే పోలిక ఉంటుంది. ఎట్టెట్టాలో క్యారికేచర్తో రక్తికట్టిస్తున్నారు.
ఈ కార్యక్రమాలు అన్నీ ఎవరికి వారు – వారికున్న పరిమితులలో కష్టపడుతున్నారు. ఐటమ్స్ ఎంపిక, దాన్ని మలిచే విధానం కీలకమైన అంశాలు. ఎడిటోరియల్ పాలసీ బట్టి ఐటమ్స్ ఎంపికా, దానికి ట్రీట్మెంటు ఉంటుంది. తీన్మార్ వార్తలలో ప్రధానంగా హాస్యం, సున్నితమైన వ్యంగ్యం ఉంటాయి; మాస్ మల్లన్నలో ఘాటు వ్యాఖ్యలు ఉంటున్నాయి. ‘ఎట్టెట్టా’ ఇదివరకు ఐ న్యూస్ లోనూ, ఇతర ఛానళ్లలోనూ పరిచయమైన ‘పిన్ కౌంటర్’ సరళీ, అదే గళమూ రక్తి కడుతున్నాయి! కోట్లూ, వాటి వాలకం పదహారేళ్ళుగా చూశాం కనుక – ఈ కొత్తరకం కార్యక్రమాలు రక్తికడుతున్నాయి. కొంత వెటకారం తగిలించవచ్చు. కనుక రంజుగా ఉంటుంది.
ఈ కార్యక్రమాలలో వార్తల ట్రీట్మెంటుకూ – టీవీ-9లో సాయంత్రం ఆరున్నరకు కనబడే పొలిటికల్ మిర్చికి కొంత పోలిక కనబడుతుంది – వెటకారం, వ్యంగ్యంలో – అలాగే సాక్షిలో కనబడే వీక్లీ ప్రోగ్రాం ‘బ్యాండ్ బాజా’కు కూడా వ్యంగ్యంలో పోలిక ఉంది. ప్రతిరోజూ చేసే కార్యక్రమాల కన్న వీక్లీ కార్యక్రమాలు నాణ్యంగా ఉంటాయి – వస్తు వైవిధ్యం కారణంగా.
సరే, మళ్ళీ టీవీ-9లో కోటు వార్తలు ఎలా మొదలయ్యాయని ఒకసారి – దశాబ్దం క్రితం – రవిప్రకాష్ను అడిగాను – కోటు ఆసక్తి ఎవరిదని? అది ఎడిటోరియల్ పాలసీ అనే ఉద్దేశ్యంతో వాకబు చేశాను. దానికాయన అలాంటిది కాదు, ఛానల్ యజమాని సూచన అని వివరించారు. నిజానికి న్యూస్ బులెటిన్ల యాంకర్ల డ్రస్సులు అటు కోటు, టైలు కాకుండా, ఇటు కొంతవరకు మనం చర్చించిన ప్రోగ్రాంల వలేకూడా కాకుండా – మధ్యస్థంగా స్థిరపడాలి. మన తెలుగు సమాజంలో తారసపడే వైవిధ్యం అంతా అక్కడ ద్యోతకమవ్వాలి. అలాంటి ప్రయోగం ఎప్పుడు జరిగితే, అప్పుడు స్థిరపడుతుంది’.
– డా. నాగసూరి వేణుగోపాల్