గతంలో మరో శాసనసభ్యుడి చేతిలో దెబ్బలు తిని చికిత్స పొందుతున్న ఆనంద్ సింగ్ (ఫైల్ ఫొటో)
బెంగళూరు: కర్నాటక కాంగ్రెస్ – జనతాదళ్ సంకీర్ణానికి మళ్లీ సంకటపరిస్థితి ఎదురయ్యేట్లుంది. తాజాగా ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చారు. ఎప్పుడెప్పుడా అని కాచుకుని కూర్చుని ఉన్న భారతీయ జనతా పార్టీ వరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తోంది.
ఎమ్మెల్యే ఆనంద సింగ్ మొదట వెళ్లి స్పీకర్కు రాజీనామా లేఖ సమర్పించారు. తర్వాత రమేష్ జర్కిహోలీ వెళ్లి తన రాజీనామా కూడా సమర్పించారు. జిందాల్ కంపెనీకి తన నియోజకవర్గంలో ప్రభుత్వ భూమి ఇస్తున్నందుకు ప్రజలు ఆగ్రహంగా ఉన్నారనీ, అందుకు తాను రాజీనామా చేస్తున్నాననీ ఆనంద్ సింగ్ మీడియాతో అన్నారు.
ప్రయివేటు పర్యటనపై అమెరికాలో ఉన్న ముఖ్యమంత్రి కుమారస్వామి, తాను టివి ఛానళ్లను గమనిస్తున్నట్లు ట్వీట్ చేశారు. తన ప్రభుత్వాన్ని అస్థిరం పాలు చేయాలన్న బిజెపి ప్రయత్నాలు పగటికలలేనని ఆయన వ్యాఖ్యానించారు. మరోపక్క బిజెపి ఈ పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తోంది. తాను కూడా అనంద్ సింగ్ రాజీనామా గురించి విన్నాననీ, అయితే ప్రభుత్వాన్ని పడగొట్టడం తమ అభిమతం కాదనీ బిజెపి రాష్ట్రశాఖ అధ్యక్షుడు యడ్యూరప్ప అన్నారు.
గతంలో కాంగ్రెస్, జనతాదళ్ శాసనసభ్యులను క్యాంప్లో ఉంచినపుడు మరో ఎమ్మెల్యే కొట్టిన కారణంగా ఆనంద్ సింగ్ ఆసుపత్రి పాలయ్యారు.