BJP: తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న ఆయన ప్రధాన ప్రత్యర్థి పెద్దిరెడ్డి రుసరుసలాడుతున్న విషయం తెలిసిందే.వీరిద్దరూ కూడా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన వారు కావడమే ఇందుకు కారణం. తెలుగుదేశం పార్టీలో ఉండగా గతంలో రెండుసార్లు హుజూరాబాద్ నుండి పెద్దిరెడ్డి గెలిచారు.
మంత్రి కూడా అయ్యారు ఆ తర్వాత ఆయన ప్రాభవం తగ్గిపోయింది .రాజేందర్ వచ్చాక అక్కడ మరొకరికి అవకాశం లేకుండా పోయింది.అటూ ఇటూ తిరిగి బిజెపిలోకి వచ్చిన పెద్దిరెడ్డి రేపటి ఎన్నికల్లో హుజూరాబాద్ నుండి ఆ పార్టీ పక్షాన పోటీ చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో ఈటల ఆయన గుండెల్లో ఈటె గుచ్చారు.దీంతో పెద్దిరెడ్డి అంతర్మథనంలో పడిపోవడమే కాకుండా తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అవసరమైతే టీఆర్ఎస్ లో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం.ఈ తరుణంలో బీజేపీ నేతలు పెద్దిరెడ్డికి కూడా నచ్చజెప్పే ప్రయత్నాలు చేపట్టారు
డీకే అరుణ బుజ్జగింపు!
తెలంగాణకు చెందిన బీజేపీ జాతీయ నాయకురాలు మాజీ మంత్రి డీకే అరుణ రంగంలోకి దిగి పెద్దిరెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారని సమాచారం. కరోనా నుండి కోలుకున్న పెద్దిరెడ్డి పరామర్శ పేరుతో అరుణ కలిసి చాలాసేపు మంతనాలు సాగించినట్లు బీజేపీ వర్గాలు చెప్పాయి.ఈటలను పార్టీలో చేర్చుకున్నా పెద్దిరెడ్డి కి కూడా తగు ప్రాధాన్యం ఇస్తామని ఆమె హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని ఆమె పెద్దిరెడ్డిని కోరగా ఆలోచిస్తానని ఆయన సమాధానం ఇచ్చినట్లు బోగట్టా.
Read More: KCR: కరోనా విషయంలో కేసీఆర్ కన్నెర్ర చేస్తే…ఇలా ఉంటుంది
ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరింపు!
ఇదిలా ఉండగానే బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పెద్దిరెడ్డికి ఇండైరక్టు వార్నింగ్ ఇచ్చారు.‘‘బీజేపీ ఎవరి అయ్యా పార్టీ కాదు.. పార్టీ నియమాల ప్రకారం ఎవరన్నా చేరొచ్చు.. ఈటల వస్తే మేం పార్టీలో ఉండమని బెదిరించే వారెవరూ లేరు.. అలాంటి వారెవరైనా ఉంటే వారి మాటలను బీజేపీ లెక్కచేయదు..’’ అని రాజాసింగ్ స్పష్టం చేశారు.ఈటల అవసరం పార్టీకి ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు.ఈటలతో పాటు మరికొంతమంది కూడా పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. “ఈటల చేరితే మేము వెళ్లిపోతాం అని కొందరు అంటున్నట్టు ప్రచారం జరుగుతోంది… అది ఫేక్.. నిజంగా ఎవరన్నా బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తే.. వారు అడ్రస్ లేకుండా పోతారు..’’ రాజాసింగ్ హెచ్చరించారు.ఇది పెద్దిరెడ్డిని ఉద్దేశించే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.మరి పెద్దిరెడ్డి ఏం చేస్తారన్నది చూడాలి.