“నీ మిత్రులెవరో ఒక్కసారి చెప్పు- నువ్వెలాంటి వాడివో నేను చెప్తా” అన్నాడట అయిదువందల ఏళ్ళ కిందటి షేక్స్పియర్. “నీ బడ్జెట్ ఒక్కసారి చూడనీ- నువ్వు దేనికి విలువిస్తావో నేను చెప్తా!” అన్నాడట మన కాలపు పెద్దమనిషి. అవును మరి! “ఈ పత్రంలో ఇన్ని అంకెలున్నాయంటే ఇది కచ్చితంగా బడ్జెట్టే అయివుంటుం”దని జార్జ్ బుష్ జోక్ చేసినప్పటికీ, నిజానికి బడ్జెట్ లో ఉండేవి అంకెలూ, సంఖ్యలూ కావు. అవి కొన్ని విలువలకు ప్రాతినిధ్యం వహించే విధాన ప్రకటనలు! ఈ దృష్టితో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను విశ్లేషించే ప్రయత్నాలు అంతగా జరగలేదనే చెప్పాలి! అందుకు కారణాలు కూడా విస్పష్టం- మన మేధావులు రాజకీయ పరిభాషలో తప్ప ఏ విషయాన్నీ విశ్లేషించే శక్తిని కోల్పోయి యుగాలయి పోయింది! ఈ ప్రకటనపై ఎవరికైనా అనుమానాలుంటే, ఇప్పటికీ టీవీల్లో జరుగుతున్న చర్చాగోష్టుల్ని ఒక్కసారి చూడాల్సిందిగా విజ్ఞప్తి!
నానీ పాల్కివాలా అనే న్యాయశాస్త్ర కోవిదుడు ఒకాయన ఉండేవాడు. (ఈ సంవత్సరం ఆయన శతజయంతి వేడుకలు మొదలవుతున్నాయి!) అనేక దశాబ్దాల పాటు ఆయన బడ్జెట్ విశ్లేషణలు చేస్తూ దేశంలోని అన్ని నగరాలూ తిరుగుతూ ఉండేవాడు. మళ్ళీ ఆయనకి ఊపిరి పీల్చుకోడానికి టైముండేది కాదు- అంత ప్రాక్టీస్ ఉండేది! దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలూ, వ్యాపార-వాణిజ్య ప్రముఖులూ నానీ పాల్కివాలా అప్పాయింట్మెంట్ కోసం ఎదురు తెన్నులు చూస్తూ ఉండేవారు. “టైం ఈజ్ మనీ” అనే మాట ఆయన విషయంలో అక్షర సత్యం! అయినప్పటికీ పాల్కివాలా తన టైం కొంత సేవ్ చేసుకుని ఈ బడ్జెట్ విశ్లేషణలను కడదాకా కొనసాగించేవారు! మిలియన్లూ, బిలియన్లూ, ట్రిలియన్ల లెక్క అప్పటికి ప్రజల్లో -ముఖ్యంగా, నానీ పాల్కివాలా విశ్లేషణలు విని కాస్తంత టాక్స్ సొమ్ము ఆదా చేసుకుందామని ఆయన ఉపన్యాసాలు వినడానికి వచ్చే వ్యాపార వర్గాల్లో – అంతగా పాపులర్ కాలేదు. అలాంటి వాళ్ళ కోసం ఆయన లక్షల కోట్ల రూపాయల లెక్కలు గడగడా వల్లిస్తూ ఉండేవారు. అలా దాదాపు మూడు దశాబ్దాలపాటు బడ్జెట్ విశ్లేషణ చేస్తూ వచ్చిన నానీ పాల్కివాలా చివరికి సోలీ సొరాబ్జీ లాంటి ప్రాణమిత్రులను సైతం గుర్తుపట్టలేని స్థితికి చేరి కన్నుమూయడం ఓ విషాదం!
ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ముందే చెప్పినట్లు నానీ పాల్కివాలా టైం అక్షరాలా నోట్ల కట్టలతో కొనుక్కోవాల్సింది. దాన్ని చక్కగా బడ్జెట్ చేసుకుని, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై లోతైన విశ్లేషణ చేసేవారు ఆయన. ఒక్కోసారి పార్లమెంట్లో ఆర్ధిక మంత్రి ఉపన్యాసం కంటే పాల్కివాలా ప్రసంగమే “రిచ్”గా ఉందని బిజినెస్ పత్రికలు వ్యాఖ్యానించడం కద్దు! ఆ ఉపన్యాసాల సారంతో మనం ఏకీభవించినా – వించకపోయినా, పాల్కివాలా విశ్లేషణ పద్ధతుల్లో వ్యక్తమయ్యే మేధస్సును గుర్తించకుండా ఉండలేకపోయేవాళ్ళం. కానీ తెలుగు – ఆ మాటకొస్తే మొత్తం భారతీయ- మేధో ప్రపంచంలో ఆజానుబాహువుల శకం ఏనాడో అంతరించిపోయింది. ఇది అంగుష్ఠమాత్రుల శకం! ఈ ప్రకటనపై కూడా ఎవరికైనా అనుమానాలుంటే, ఇప్పటికీ తెలుగు, ఇంగ్లిష్ టీవీ ఛానెళ్లలో జరుగుతున్న బడ్జెట్ చర్చాగోష్టులు మరొక్కసారి చూడాల్సిందిగా విజ్ఞప్తి!
మన మేధావులు, బడ్జెట్ ఫిగర్స్ని కేవలం విలువలకు ప్రతినిధులుగా చూడగలిగిన నాడు మాత్రమే మన రాజకీయాలు విలువల ప్రాతిపదికగా పనిచెయ్యడం మొదలైందని గ్రహించగలం! అలా కాకుండా, అంకెలూ-సంఖ్యలూ, కూడికలూ – తీసివేతలూ, గుణకారాలూ – భాగహారాల సముచ్చయంగా బడ్జెట్ ను చూసినంతకాలం దాని రూపమే మనకి కనిపిస్తుంది తప్ప సారం బోధపడదు!
ఎన్నికలకు ముందు, మన ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్లు పక్కా ఎన్నికల బడ్జెట్లుగా ఉండడం, కొత్త ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్లు ఆయా ఎన్నికల్లో తమను గెలిపించిన వర్గాల (అనగా కులాలూ మతాలూ ఉపకులాల) సంక్షేమం దృష్టిలో పెట్టుకుని రూపొందించే బడ్జెట్లు అయిఉండడం కొత్తేమి కాదు. ఎటొచ్చీ ఏళ్లతరబడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతూ వచ్చిన “నవరత్నాల” ప్రాతిపదికగా ఈ బడ్జెట్ రూపు దిద్దుకోవడం విశేషమే! అయితే, అలా చెయ్యడంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన విశిష్టత ప్రదర్శించారు. ఉదాహరణకి రెండుంపావు (2 .27) లక్షల కోట్ల బడ్జెట్లో ఒక్క కాపుల సంక్షేమానికే రెండువేల కోట్ల రూపాయలు కేటాయించడం లోని ఆంతర్యం సుస్పష్టం. జనసేనకు వెన్నెముకగా ఉన్న కాపుల్ని మంచిచేసుకోవాలన్న జగన్ ఆకాంక్ష ఈ అంకెల మాటునుంచి స్పష్టంగానే కనిపిస్తోంది. ఇదే పని చంద్రబాబు నాయుడు లాంటి వృత్తి రాజకీయవేత్త చేసివుంటే, దానికి “సోషల్ ఇంజినియరింగ్” లాంటి ముద్దుపేరు పెట్టి మీడియాలోనూ -ముఖ్యంగా సోషల్ మీడియాలోనూ- చెక్కభజన చేసే నిపుణులు ఈ విషయాన్ని అంతగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అంతకు మించి, ఇదే జగన్, ఎన్నికల నేపథ్యంలోనే, కాపులకు రిజర్వేషన్ కల్పించడం పై వాగ్దానం చెయ్యలేననీ, అది రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో లేదనీ, తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ప్రకటించిన సంగతి గుర్తు చేసుకోవాల్సి వుంది! తీరా బడ్జెట్ కేటాయింపుల విషయం వచ్చేసరికి ఒక్క కులానికే రెండువేల కోట్లు కేటాయించారు. దీన్ని “మాస్టర్ స్ట్రోక్” లాంటి అరిగిపోయిన మాటలతో అభివర్ణించడం అసాధ్యం! చంద్రబాబు ఇరవయ్యేళ్లపాటు ఆరగదీసిన మరో మాట -“మైండ్సెట్ మారడం”- అంటే ఇదే!
మైండ్సెట్ మార్చుకోడం, మార్చడం అంటే టీవీ సెట్ మార్చడమంత తేలికైన విషయం కాదని కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించడం ఆయనకే మంచిది. అదంత తేలికైన పని కాదు కనకనే, ఎక్కడెక్కడో చక్రం తిప్పాననే చంద్రబాబు, రెండు దశాబ్దాలు ఆ మాటని జపించాడే తప్ప దాన్ని ఎప్పుడూ అమలు చేసే ప్రయత్నం చెయ్యలేదని కూడా జగన్ గుర్తించాలి. అన్నిటికీ మించి, మైండ్సెట్ మారితే సామాజిక భూకంపాలు రావచ్చునని, అవి యథాతథవాద రాజకీయాలకు అంతగా శోభించవనీ కూడా గ్రహించాలి కొత్త ముఖ్యమంత్రి గారు! అయితే కావాలనే యథాతథవాదాన్ని కాదనుకునే, ఇలాంటి ప్రయోగాలు చేసివుంటే అలాంటి రాజకీయవేత్తకి మనలాంటి వ్యాఖ్యాతలు చెప్పగలిగేది పెద్దగా ఉండదు మరి!!
మందలపర్తి కిషోర్
ReplyForward |
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ