అమరావతి: రాష్ట్రంలో పోలింగ్ సరళి, అంచనాలపై సమీక్షించేందుకు టిడిపి అధినేత చంద్రబాబు శనివారం మంగళగిరి సమీపంలోని హ్యాపీ రిసార్ట్స్లో సమావేశం నిర్వహించారు.
ఈ నెల 22వ తేదీ వరకూ రోజుకు రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమీక్ష జరుపనున్నారు. పోటీ చేసిన అభ్యర్థులతో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి సుమారు 50మంది ముఖ్య నాయకులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు.
తొలి రోజు రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలోని నాయకులతో చంద్రబాబు సమీక్ష జరిపారు. పోలింగ్ సరళికి సంబంధించి అభ్యర్థులు అందజేసిన నివేదికలను పరిశీలించారు. పోలింగ్ బూత్ల వారీగా పోల్ అయిన ఓట్లు తదితర విషయాలపై పరిశీలన జరిపారు. 23 కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జగ్రత్తలను చంద్రబాబు వివరించారు.
ప్రతి కార్యకర్త పొలిటికల్ ఇంటెలిజెన్స్ పెంచుకోవాలని చంద్రబాబు సూచించారు. ఇక మీదట ప్రతి ఎన్నికలోనూ టిడిపినే గెలవాలని, ఆ దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కార్యకర్తల సంక్షేమం కోసం ఏడాదికి వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.