విజయవాడ, ఏప్రిల్ 25: పోలవరం ప్రాజెక్టుపై కేసులు వేసి ఇబ్బందులు పెడతుంటే వైసిపి అధినేత జగన్ ఎందుకు మాట్లాడటం లేదని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తవ్విన మట్టిని ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందో లేదో తెలుసుకునేందుకు గురువారం జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్టిజి) బృందం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించనుంది.
పోలవరం కోసం మట్టి తవ్వుతూ ఎక్కడపడితే అక్కడ పోయడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతోందని పర్యావరణవేత్త పెంటపాటి పుల్లారావు ట్రైబ్యునల్లో పిటిషన్ వేశారు. సుప్రీం కోర్టులోను ఈ వ్యాజ్యం నడుస్తోంది. దీనిపై గతంలోనే ఎన్జిటి బృందం నివేదిక తయారు చేసింది. మే 10న విచారణ జరిగే సమయానికి క్షేత్రస్థాయిలో సమగ్ర దర్యాప్తును జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఎన్జిటీ ఆదేశించింది. ఈ మేరకు కౌన్సిల్ బృందం గురువారం పోలవరం ప్రాజెక్టుకు వస్తుండగా మంత్రి దేవినేని ఉమా స్పందించారు.
ప్రాజెక్టును అడ్డుకోవడమే ధ్యేయంగా సుప్రీం కోర్టులో, గ్రీన్ ట్రైబ్యునల్లోనూ కేసులు వేయిస్తున్నారని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిబంధనల ప్రకారమే జరుగుతోందని ఉమా స్పష్టం చేశారు. టిడిపి అధికారంలోకి వస్తుందన్న భయంతోనే నేషనల్ గ్రీన్ ట్రెబ్యునల్లో కేసులు వేస్తున్నారని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్టుపై కెసిఆర్ ప్రభుత్వం దుర్మార్ఘాలు చేస్తుంటే జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ఉమా ప్రశ్నించారు.