YSRCP: వైఎస్సార్ సీపీ YSRCP విజయసాయి రెడ్డి వైసీపీకి, సీఎం జగన్ కు వెన్నుదన్నుగా ఉండే వ్యక్తి..! నిన్నమొన్నటి వరకూ పార్టీలోని నేతలకు ఈ అభిప్రాయమే ఉండేది. ఇప్పుడా నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారా? పార్టీ నేతలు, కేడర్లో ఆయన వ్యాఖ్యలు ఇబ్బందిగా మారాయా? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. ఇటివల అనంతపురం జిల్లాలో లోకేశ్ సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా మైనస్సే తప్ప పార్టీకి, ఆయనకు ఏమాత్రం లాభం కలిగించవు. యువకుడు, తనపై వ్యక్తిగత విమర్శలు, అధికారం కోల్పోవడంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు. కానీ.. విజయసాయిరెడ్డి పెద్దమనిషి. పెద్దల సభలో వైసీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పైగా.. పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అయినా.. ఆయనలో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది.
ట్విట్టర్ లో అభిప్రాయాలు చెప్పుకోవచ్చు అంటూ.. ఆయన చేసే ట్వీట్ లు ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఆయన ట్విట్టర్ పలుకుల్లో ఎప్పుడూ.. గుంటనక్క, శుంఠ నక్క, పిట్టలదొర, సింహం, పులి, పిల్లి.. ఇలాంటివే ఉంటాయి. ఎవరికైనా విసుగు తెప్పించేవే ఇవి. దీనికో కవితను అల్లినట్టు కొన్ని పదాలు జోడిస్తారు. ఇవన్నీ ఎవరికి ఉపయోగమో అర్ధం కాదు. ఇటివల హైకోర్టు తీర్పు తో మన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న అశోక్ గజపతిరాజును దొంగ, చంద్రబాబును గజదొంగ అంటూ ప్రస్తావించారు. ‘పైకోర్టులు ఉన్నాయి.. న్యాయం జరుగుతంది.. అందరి బంఢారం బయటపడుతుందనే నమ్మకం ఉంది’ అంటే ఆయన హోదాకు తగ్గట్టుగా ఉండేది. కానీ.. దొంగ, గజదొంగల పద ప్రయోగం వల్ల ఆయనకు కాదు.. పార్టీకి, జగన్ కు నష్టం.
Read More: Mp: ‘ఎంపీ’లో టెన్షన్ మొదలైందా..? స్పీకర్ ని కలిసింది అందుకేనా..?
అసలే కులాలు, ప్రాంతీయతత్వం కుంపట్లో రగిలే రాష్ట్రం ఏపీ. రాజులు, ఉత్తరాంధ్ర ప్రజలకు తన మాటలు ఎలా రుచిస్తాయని విజయసాయి భావిస్తున్నారో అర్ధం కాదు. ఇప్పుడున్న అధికారం 2024లో మళ్లీ దక్కాలంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయచ్చో లేదో ఎంపీగా ఉన్న విజయసాయికి మరొకరు చెప్పాల్సిందే. జగనే ఇందుకు రంగంలోకి దిగితే.. విజయసాయి పరువు దక్కుతుందా? పైగా.. ఎంపీగారు ప్రజాక్షేత్రంలో కూడా పోటీ చేసి సత్తా చాటే వ్యక్తి కాదు. ఒక పెద్దగా పార్టీకి అండగా నిలవాల్సిన వ్యక్తి. కాబట్టి.. ఇప్పుడైనా తన తన మాటలు ప్రజలకు వెగటు పుట్టించకుండా ఆలోచన రేకెత్తిస్తే.. సీఎం జగన్ కు, పార్టీకి మేలు చేసినవారవుతారు. మరి.. ఆయన తీరు మారుతుందో.. మారదో.. మారుస్తారో.. మార్చరో.. చూడాల్సి ఉంది!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?