న్యూఢిల్లీ : వ్యంగ్యవార్తావిభాగం : దేశంలో పరిస్థితులపై 94 మంది ‘మేధావులు’ నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. గుప్తయుగం తర్వాత తొలిసారిగా దేశంలో మరోసారి స్వర్ణయుగం ప్రారంభమైందని వారు తమ లేఖలో మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. రామ్ మాధవ్, జీవీఎల్ నరసింహా రావు, వివేక్ అగ్నిహోత్రి, ప్రభాత్ ఝా, శంకర్ శరణ్, టి హనుమాన్ చౌదరి, దిలీప్ ఘోష్, సంబిత్ పాత్ర, రాకేశ్ సిన్హా తదితర మేధావులు ఈ లేఖపై సంతకాలు చేశారు. లేఖ చివరన అమిత్ షా సంతకం ఉన్నా ఎందుకోగాని దానిపై ఇంటూ మార్కు పెట్టారు.
ఛప్పన్ ఇంచ్ కీ ఛాతీ (56 ఇంచుల ఛాతీ) షేర్ నరేంద్ర మోదీ పరిపాలన చెప్పలేనంత ప్రజారంజకంగా సాగుతోందని వారు అభిప్రాయపడ్డారు. ఆ మాటకొస్తే ‘రామరాజ్యం’ కూడా కింగ్ కాంగ్ మోదీ పాలన ముందు దిగదుడుపేనని వారు వ్యాఖ్యానించారు. రాంబో ఫేమ్ సిల్వస్టర్ స్టాలోన్ ఛాతీ సైజు 54 ఇంచులేనని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నిజం చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నామనీ, అవాకులూ చవాకులూ పేలుతున్న నకిలీ- సూడో-కుహనా ధావుల మాట అసలే పట్టించుకోవద్దనీ వారు తమ లేఖలో పేర్కొన్నారు. ఇటీవల ఆదూర్ గోపాలకృష్ణన్, శుభా ముద్గల్, శ్యాం బెనగల్, మణిరత్నం, అపర్ణాసేన్, రామచంద్ర గుహ వంటి 49 మంది మేధావులు మోదీ పాలనను ఎండగడుతూ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖలోని అంశాలను ఖండిస్తూ దేశభక్త మేధావులు లేఖాస్త్రం సంధించారు. పరిపాలన అంటే సినిమాలు తీయడం, పత్రికల్లో వ్యాసాలు రాయడం కాదని వారు యద్దేవా చేశారు.
కలియుగంలో విష్ణ్వవతారంగా మోదీ జన్మించి దుష్టుల పనిపడుతున్నారన్నారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ‘సంభవామి యుగే యుగే’ అన్నది మోదీ విషయంలో అక్షరాలా నిజమైందన్నారు. 2014 తర్వాత రెండొందలకు పైగా మతపరమైన హింసాత్మక ఘటనలు జరగ్గా, వాటిలో సుమారు వంద మంది హతులయ్యారంటూ మూకహత్యలపై కుహనా మేధావులు గగ్గోలు పెడుతున్నారనీ నిజానికి ఆ సంఖ్య వేలల్లో కాకుండా వందల్లోనే ఉన్న సంగతి గమనించాలని మోదీ మేధావులు వ్యాఖ్యానించారు. జై శ్రీరాం అన్న నినాదం మోదీ రామరాజ్యాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.
దేశంలో దుష్టపార్టీలేవీ ప్రభుత్వంలో ఉండకూడదనీ, అందుకే కర్ణాటకలాంటి రాష్ట్రాల్లో విపక్షాల ప్రభుత్వాలను పడేసి బుద్ధి చెబుతున్నందుకు మేధావులు తమ లేఖలో మోదీని అభినందించారు. ఎక్కడో ఆకాశంలో తిరుగుతున్న పనికిరాని ఉపగ్రహాలను పడగొట్టే టెక్నాలజీని మోదీ అభివృద్ధి పరచిన సంగతి వారు గుర్తు చేశారు. అలాగే భూమ్మీద ఉన్న పనికిరాని పార్టీల ప్రభుత్వాలను కూడా మీరు మీ రాజకీయ కౌశలంతో కూల్చేస్తున్నారని వారు మోదీని కొనియాడారు.ప్రస్తుతం దేశంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఇక పోలీసులు అవసరం లేదనీ, ఆ పని బీజేపీ లా- మేకర్సే చేస్తారని వారు సమర్థించారు. ఆ మేరకు పార్లమెంటులో చట్టసవరణ చేయాలని వారు ప్రధానికి సూచించారు. ఆ క్రమంలోనే ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ మందుకొడుతూ గన్ డ్యాన్స్ చేశారన్నారు. ఆ డ్యాన్స్లోని కళాత్మక విలువలను గమనించకుండా ఆయన వాడిన గన్లపై విరుచుకుపడడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. యుపి సోన్భద్రలో గిరిజనుల ఊచకోతను రాజకీయం చేయనీకుండా విపక్షాలను అడ్డుకోవాలని వారు మోదీని గట్టిగా అభ్యర్థించారు. యోగి ఆదిత్యనాథ్ వంటి సర్వసంగపరిత్యాగి పరిపాలనను ప్రశ్నించడం దేశద్రోహమే కాక దైవద్రోహం కూడానన్నారు. దళిత యువకుడితో యుపి బీజేపీ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా కూతురు సాక్షీ మిశ్రా పెళ్లి రగడతోనైనా విపక్షాలు వాస్తవిక పరిస్థితులను గుర్తెరగాలన్నారు.
దేశమంతా సుభిక్షంగా ఉందనీ, ఎక్కడైనా సమస్యలున్నాయీ అంటే అది విపక్ష సభ్యుల నియోజకవర్గాల్లోనేననీ మేధావులు పేర్కొన్నారు. ఒకే దేశం ఒకే పార్టీ ఒకే జెండా మన నినాదం కావాలన్నారు. ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను పాతికేసి కోట్లు వెదజల్లి బీజేపీ కొనుగోలు చేస్తోందన్న ఆరోపణలపై కూడా వారు ఘాటుగా స్పందించారు. చేతనైతే ధర పెంచి వాళ్లని పార్టీ నుంచి బయటకు పోనీయకుండా చూసుకోవాలని వారు సవాలు విసిరారు. పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని విపక్ష ప్రభుత్వాలను కూడా కూల్చేస్తే తప్ప ‘స్వచ్ఛభారత్’ సాధ్యపడదన్నారు. వీలైతే విదేశాల్లో కూడా అక్కడి ప్రభుత్వాలను కూల్చేసి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాలని వారు మోదీకి సలహా ఇచ్చారు. చంద్రయాన్ ప్రాజెక్టును మరింత విస్తృతపరచి సమీప భవిష్యత్తులో చంద్రగ్రహంపై సైతం బీజేపీ ప్రభుత్వాన్ని నెలకొల్పాలని మేధావులు మోదీకి సూచించారు. మార్స్ వంటి ఇతర గ్రహాల్లో సైతం మీ (మోదీ) ప్రభుత్వం ఏర్పాటయ్యే రోజు మరెంతో దూరం లేదని వారు ఈ లేఖలో వ్యాఖ్యానించారు. మోదీ పాలనను విమర్శిస్తూ లేఖ రాసిన 49 మందిని నకిలీ మేధావులుగా ప్రకటిస్తూ గజెట్ నోటిఫికేషన్ జారీ చేయాలని 94 మంది మేధావులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇకపై తమని మాత్రమే అసలు మేధావులుగా గుర్తించాలని వారు కోరారు.
Note: వ్యంగ్యవార్త అన్నది Faking News రచనాపద్ధతిలో ఒక భాగం. ఇవి నిజం వార్తలు కావు. ఆయా వాదనలు, రాజకీయ నాయకుల వైఖరుల్లోని డొల్లతనాన్ని వ్యంగ్యపద్ధతిలో ఎత్తిచూపడం దీని ఉద్దేశ్యం. పాఠకులు గమనించగలరు.)