(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పార్టీలలో మిశ్రమ స్పందన కలిగించాయి. లోక్సభ ఎన్నికలకు సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి ఈసారి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయన్న అంచనాలతో ఆ పార్టీలో ఉత్సాహం రెట్టింపయింది. మంగళవారం మిత్రపక్షాలతో కలిసి కూర్చుని భవిష్య కార్యాచరణ గురించి చర్చించాలని ఆ పార్టీ నిర్ణయించింది.
అయితే బిజెపికి కూడా ఒకటి రెండు ఆందోళన కలింగించే అంశాలు లేకపోలేదు. మెజారిటీ పరంగా చూసినా, పార్టీ ప్రతిష్ట పరంగా చూసినా బిజెపికి ఎంతో ముఖ్యమైన ఉత్తరప్రదేశ్లో ఎలాంటి ఫలితాలు వస్తాయన్న విషయంలో ఆయా ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య చాలా వ్యత్యాసం ఉండడం ఆ పార్టీకి ఆందోళన కలిగిస్తోంది. బిజెపి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడిన పశ్చిమ బెంగాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనిఉంది.
ఇక ఇతర రాష్ట్రాలలో చూస్తే బిజెపికి దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్లో సొంతంగా సీట్లు రాకపోయినా చంద్రబాబు నాయకత్వంలోని టిడిపికి విజయం దక్కకపోవడం ముఖ్యం. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డిఎ నుంచి బయటకు వచ్చిన తర్వాత మోదీని ధిక్కరించి జాతీయ స్థాయిలో ప్రతిపక్ష ఫ్రంట్ కోసం అన్ని పార్టీలనూ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చెస్తున్నారు. అక్కడ ప్రతిపక్షమైన వైసిపికి మెజారిటీ వచ్చిన పక్షంలో అది బిజెపికి కలిసివచ్చే అంశమే.
జాతీయ స్థాయిలో అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బిజెపికి స్పష్టమైన మెజారిటీ సూచిస్తున్నప్పటికీ చంద్రబాబు మాత్రం తన వంతు ప్రయత్నాలు మానలేదు. తాజాగా ఆయన సోమవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ నేత మమతా బెనర్జీని కలిసి మంతనాలు జరపారు. చంద్రబాబు లాగా మమతా బెనర్జీ కూడా ఎగ్జిట్ పోల్స్ గురి తప్పాయని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో రెండు ఎగ్జిట్ పోల్స్ తప్ప మిగతావన్నీ వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసిపికి మంచి మెజారిటీ సూచించాయి. ఈ అంచనాలతో ఆ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో 23వ తేదీ వోట్ల లెక్కింపు కోసం తయారవుతోంది.
మాజీ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలు, ఇవిఎంలపై ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలను పటాపంచలు చేయగలిగిన పరిణామంగా అభివర్ణించారు. ఎగ్జిట్ పోల్ అంచనా అనేది వోటర్ల అబిప్రాయాలను తెలుసుకుని రూపొందించేది కాబట్టి, రేపు ఈ అంచనాలతో ఫలితాలు సరిపోలితే ఇక ఇవిఎంల విశ్వసనీయతపై ప్రతిపక్షాలు వ్యక్తం చేసే అనుమానాలకు విలువుండదని ఆయన అన్నారు.