(picture tweeted by ANI twitter)
ముంబై: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పలువురు సెలబ్రిటీలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా ముంబైలోని బాంద్రాప్రాంతంలో సోమవారం ఉదయమే ఓటేశారు. సెయింట్ ఏన్స్ హైస్కూలుకు తన భార్య కిరణ్ రావుతో కలిసి పది గంటల సమయంలో వెళ్లి ఆయన ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది మనందరికీ చాలా ముఖ్యమైన రోజు. ప్రతి ఒక్క వ్యక్తి ఇందులో భాగం కావడం చాలా ముఖ్యం. నేను, కిరణ్ ఓటు వేశాం. దేశంలో ప్రేమ, సమగ్రత, అభివృద్ధి ఉండాలి. ప్రజలు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని వచ్చి ఓటేయాలి’’ అని సందేశం ఇచ్చారు. దాంతోపాటు ఓటుహక్కు గురించిన ఓ జోకును కూడా అక్కడున్నవారితో ఆమిర్ పంచుకున్నారు.
ముంబైలో ఓటు హక్కు వినియోగించుకున్న హీరోయిన్ కంగనా రనౌత్
‘‘ఓసారి అమెరికా అధ్యక్షుడు పార్కులో ఉదయపు నడకకు వెళ్తున్నారు. ఒక వ్యక్తి ఎదురై.. మీరేం చేస్తారని ప్రశ్నించారు. దానికి ఆయన తాను అమెరికా అధ్యక్షుడినని చెప్పి, మీరేం చేస్తారని ఆయనను ఎదురు ప్రశ్నించారు. దానికి ఆయన ‘నేను అమెరికా అధ్యక్షుడిని ఎన్నుకుంటాను’ అని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారు’’ అనగానే ఒక్కసారిగా అక్కడున్నవారంతా నవ్వుల్లో మునిగి తేలారు. ఆమిర్ తో పాటు కంగనా రనౌత్, రేఖ, ప్రియాంకా చోప్రా, మాధురీ దీక్షిత్, శంకర్ మహదేవన్, పరేష్ రావల్, రవికిషన్ తదితరులు ముంబైలో ఓట్లు వేశారు.
ముంబైలో ఆరు లోక్ సభ స్థానాలతో పాటు మహారాష్ట్రలోని మరో 11 నియోజకవర్గాలకు నాలుగోదశలో పోలింగ్ జరుగుతోంది. రంగీలాలో ఆమిర్ సరసన నటించిన ఊర్మిలా మతోండ్కర్ సహా పలువురు ప్రముఖులు ఈసారి బరిలో ఉన్నారు. బీజేపీకి చెందిన పూనమ్ మహాజన్ కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన ప్రియాదత్ తో పోటీ పడుతున్నారు. ప్రస్తుత ఎంపీ అరవింద్ సావంత్ తో కాంగ్రెస్ నేత మిలింద్ దేవరా తలపడుతున్నారు.