అమరావతి: మొబైల్ వినియోగదారులకు సెల్ కంపెనీ లు చేదు వార్త అందిస్తున్నాయి.ఇప్పటి వరకు తక్కువ ధరలతో మొబైల్ డేటా, కాల్స్ వాడుకున్న వినియోగదారులపై భారీగా భారం పడనుంది. వివిధ సెల్ కంపెనీలు సిమ్ రీఛార్జ్ ధరలను భారీగా పెంచుతున్నాయి.
ఈ నెల మూడవ తేదీ నుండి కాల్ చార్జీలు, డేటా చార్జీలను పెంచుతున్నట్లు వోడాఫోన్ -ఐడియా ప్రకటించింది. ప్రీపెయిడ్ విభాగంలో 28, 84, 368 రోజుల వాలిడిటీతో కూడిన ప్లాన్ లపై చార్జీలను పెంచనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ప్లాన్ లతో పోలిస్తే తాజా ప్లాన్ దాదాపు 42శాతం మేరకు భారమవుతాయని భావిస్తున్నారు.
డిసెంబర్ నుండి మొబైల్ టారిఫ్ లను పెంచుతామని భారత టెలికం ఆపరేటర్ లు గతనెల లోనే ప్రకటించాయి. టెలికం టారిఫ్ ల సవరణపై ట్రాయ్ సంప్రదింపుల ప్రక్రియ నేపథ్యంలో వోడాఫోన్ ఐడియా టారిఫ్ పెంపును ప్రకటించింది.
మరోవైపు డేటా వినియోగం పై ప్రతికూల ప్రభావం చూపని రీతిలో రానున్న వారాల్లో టారిఫ్ లను పెంచుతామని రిలయన్స్ జియో ఒక ప్రకటన లో పేర్కొన్నది. ఎయిర్ టెల్ సైతం టారిఫ్ ల పెంపుకు రంగం సిద్ధం చేసింది.