న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు అందుకున్నారు. ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన 66వ జాతీయ చలన చిత్రాల పురస్కారాల్లో భాగంగా కేంద్రం.. అమితాబ్ బచ్చన్ను సినీ రంగంలో అత్యున్నత సినీ జీవిత సాఫల్య పురస్కారమైన ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డుతో గౌరవించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అమితాబ్ ఈ అవార్డ్ను స్వీకరించారు. ఈ అవార్డు అందుకున్న 50వ వ్యక్తిగా అమితాబ్ బచ్చన్ నిలిచారు.
కొద్ది రోజుల క్రితమే ఈ పుస్కారాన్ని అమితాబ్ స్వీకరించాల్సినప్పటికీ అనారోగ్య కారణాలతో హాజరుకాలేకపోయారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీంతో తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో అమితాబ్ కు ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అమితాబచ్చన్ మాట్లాడుతూ… తనను అవార్డు కోసం ఎంపిక చేసిన జ్యూరికి, అవార్డు అందజేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు కృతజ్ఞతలు తెలిపారు. తనను ఇంతగా ఆరాదించిన భారతీయ సినిమా ప్రేక్షకులకు, అన్ని విధాలుగా ప్రోత్సహించిన దర్శకనిర్మాతలకు అమితాబ్ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి అమితాబ్ భార్య జయ బచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్ హాజరైయ్యారు.