అమరావతి: రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నంకు తరలించే ప్రయత్నాలు అపి వేయాలనీ, అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని రైతులు ఆందోళన చేస్తున్న సందర్భంలో ఓ రైతు భారతదేశ రెండవ రాజధానిగా అమరావతిని ప్రకటించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు సంజీవరెడ్డి ప్రధాని మోదీకి లేఖ పంపారు. భారతదేశానికి రెండవ రాజధాని లేనందున ఈ ప్రాంతాన్ని దేశ రెండవ రాజధానిగా ప్రకటించాలని కోరారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూమి 20 వేల ఎకరాల వరకు ఉందనీ, పేద, సన్నకారు రైతులు భూమిని ప్రభుత్వానికి స్వచ్చందంగా ఇచ్చారనీ లేఖలో పేరొన్నారు.
దక్షిణాదిన ఉన్న అన్ని రాష్ట్రాలకు అమరావతి మధ్యలో ఉండటంతో పాటు సమీపంలో విమానాశ్రయం, ఓడరేవులు, జాతీయం రహదారులకు దగ్గరగా సౌకర్యంగా ఉందని తెలిపారు.
ఇప్పటికే అమరావతిలో ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంస్థలను, విద్యాసంస్థలను కేంద్రం మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.అమరావతిలో గత ప్రభుత్వం ఆరు లైన్ల రోడ్లు నిర్మాణం చేసిందని తెలిపారు.అంతే కాకుండా ఈ ప్రాంతంలో పలు చరిత్రాత్మిక దేవాలయాలు ఉన్నాయని సంజీవరెడ్డి పేర్కొన్నారు.