ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలతో కూడిన ‘మహా వికాస్ అఘాడి’ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి ఉద్ధవ్ థాకరే సారథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆరుగురితోనే మహారాష్ట్ర మంత్రివర్గం కొనసాగుతోంది. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల నుంచి ఇద్దరు చొప్పున మంత్రులుగా నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేశారు. తాజా విస్తరణ సందర్భంగా మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో తీసుకోనున్నారు. శివసేన నుంచి 13 మందిని, ఎన్సీపీ నుంచి 13 మందిని, కాంగ్రెస్కు చెందిన 10 మందిని మంత్రివర్గంలో చేర్చుకోనున్నారని సమాచారం. ఎన్సీపీ నేత అజిత్ పవార్ మళ్లీ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సోదరుడి కుమారుడైన అజిత్ పవార్ నెల రోజుల క్రితం రాత్రికి రాత్రి బీజేపీతో చేతులు కలిపి ఉదయానికల్లా డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే, కుటుంబ సభ్యుల బుజ్జగింపులతో అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవికి నాలుగు రోజుల్లోనే రాజీనామా చేసి తిరిగి సొంత గూటికి చేరారు. దీంతో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత శివసేన – కాంగ్రెస్ – ఎన్సీపీ కూటమి సారథ్యంలో నవంబర్ 28న ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి డిప్యూటీ సీఎంగా ఎవరు ప్రమాణస్వీకారం చేస్తారు? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన అజిత్ పవార్ను ఉద్ధవ్ ఠాక్రే క్యాబినెట్లో తీసుకుంటారా ? అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే, తాజా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అజిత్ పవారే మళ్లీ డిప్యూటీ సీఎం కాబోతున్నట్లు తెలిసింది.