ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనే గెలుస్తుందని, మళ్లీ తానే సీఎం అవుతానని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. అయతే, మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 162, శివసేన 126 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. సీట్ల పంపిణీపై మరికొన్ని రోజుల్లో ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. శివసేనకు చెందిన సామ్నా పత్రికను తానెప్పుడూ చదవలేదన్నారు. క్యాబినెట్లో ఉన్న శివసేన మంత్రులతో కలిసే పూర్తి నిర్ణయాలు తీసుకున్నట్లు సీఎం తెలిపారు. మళ్లీ సీఎం బాధ్యతలు చేపట్టనున్నట్లు ఫడ్నవీస్ విశ్వాసం వ్యక్తం చేశారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ- శివసేన పార్టీలు కలిసి పోటీ చేశాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేయనున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేసిన ఈ రెండు మిత్ర పక్షాలు.. అనంతరం జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి వారుగా పోటీ చేశారు. ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగిన బీజేపీ ఫలితాల అనంతరం ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను దక్కించుకోలేకపోయింది. 288 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీ 122 సీట్లు, శివసేన 63 స్థానాల్లో విజయం సాధించాయి. అనంతరం రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. కాంగ్రెస్- ఎన్సీపీలు కలిసి పోటీ చేయనున్నాయి.
మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికలకు నగరా మోగింది. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. ఒకే విడతలో అక్టోబరు 21న పోలింగ్ నిర్వహించనున్నారు. మహారాష్ట్రలో 288, హరియాణాలో 90 స్థానాలకు అక్టోబరు 21 పోలింగ్ నిర్వహించి ఫలితాలను అదే నెల 24 వెల్లడించనున్నారు. మహారాష్ట్రలో మొత్తం 8.94 కోట్ల మంది, హరియాణాలో 1.82 కోట్ల మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.