అమరావతి:కాపులను మోసం చేయడం వల్లనే మిమ్మల్ని ఆ పక్కన కూర్చొబెట్టారు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యాఖ్యానించారు. కాపులకు అయిదు శాతం రిజర్వేషన్పై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు అడిగిన ప్రశ్నపై సిఎం జగన్ వివరణ ఇచ్చారు. తమ ఎన్నిక ఫ్రణాళిక చదివి వినుపిస్తూ, చేయగలిగిందే చెబుతామని జగన్ అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బడ్జెట్లో కాపులకు రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
బడ్జెట్పై చర్చ సందర్భంగా మంగళవారం కాపు రిజర్వేషన్ అంశం ప్రస్తావనకు వచ్చింది. కేంద్రం ఆర్ధికంగా వెనుబడిన కులాలకు ప్రకటించిన పది శాతం రిజర్వేషన్లో కాపులకు సామాజిక న్యాయం చేయడం కోసం ఐదు శాతం కేటాయించాం. దానిపై ఈ ప్రభుత్వ విధానం ఏమిటి, దాన్ని అమలు చేస్తారా లేదా చంద్రబాబు ప్రశ్నించారు.
దీనిపై వైసిపి సభ్యుడు ధర్మశ్రీ మాట్లాడుతూ మాటలు చెప్పడమే గానీ ఒక్కరికైనా కాపులకు బిసిలుగా సర్టిఫికెట్ ఇచ్చారా అని ప్రశ్నించారు. కాపులలో ఒక్కరికైనా బిసి సర్టిఫికెట్ ఇచ్చినట్లు చూపితే దానికి కమిట్ అవుతామని ధర్మశ్రీ అన్నారు. వైసిపి సభ్యులు అంబటి రాంబాబు, కొలుసు పార్థసారధిలు సైతం చంద్రబాబు కాపులను మోసం చేశారంటూ విమర్శించారు.
దీనిపై సిఎం జగన్ మాట్లాడుతూ బడ్జెట్పై చర్చ జరుగుతోందా లేదా మరొకటి జరుగుతుందా అని ప్రశ్నించారు. కాపులను మోసం చేసి ఏ మాత్రం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని జగన్ దుయ్యబట్టారు. మీరు కాపులను మోసం చేశారన్నదానికి ఉభయ గోదావరి జిల్లాలో మీకు వచ్చిన సీట్లే నిదర్శనం అని జగన్ అన్నారు. కాపులకు ఏమి చేయబోతున్నామో ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టామని జగన్ పేర్కొన్నారు. కేంద్రం ఇబిసిలకు ఇచ్చిన రిజర్వేషన్లో కాపులకు గానీ మరొకరికి గానీ వాటా ఇవ్వడం ఏలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. దీనికి చట్టబద్ధత ఉండదనీ, అందుకే దీనిపై కోర్టులో కేసు దాఖలయిందనీ జగన్ పేర్కొన్నారు.