తాము అధికారంలోకి వస్తే మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.చంద్రబాబు శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. పలు హామీలిచ్చారు.
- ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ ల్యాప్ట్యాప్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
- కోటి మంది డ్వాక్రా మహిళలకు స్మార్ట్ఫోన్లు పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు. సాంకేతికతను ఉపయోగించుకొని ప్రత్యేక యాప్ ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు.
- ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ.2 లక్షల కనీస ఆదాయం వచ్చేలా చేసే బాధ్యత నాదేనన్నారు.
- కొన్నిరోజుల క్రితం తాను పసుపు-కుంకుమ మూడు సార్లు ఇస్తానని చెప్పానని, ఇప్పుడు ఆలూరు సాక్షిగా మూడు సార్లు కాదు, ప్రతి ఏడాది పసుపు-కుంకుమ ఇస్తానంటూ హామీ ఇచ్చారు. మూడో విడత చెక్కు నాలుగు వేల రూపాయలు రేపో, ఎల్లుండో బ్యాంకులో మార్చుకోవచ్చన్నారు.
- బిసిల కోసం ప్రత్యేకంగా బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఎస్సి, ఎస్టిలకు 150 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని ప్రకటించారు.
- యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. నిరుద్యోగ భృతిని మూడు వేల రూపాయలకు పెంచుతామన్నారు.
- ఈ నెలలోనే రైతు రుణమాఫీ నాలుగు,ఐదొవ విడతల చెక్కులు ఇస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
- కర్నూలు జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని, మాదిగలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా జగన్, మోది, కేసిఆర్పై కూడా చంద్రబాబు విమర్శలు చేశారు. జగన్ లాలూచీ రాజకీయాలు చేస్తున్నాడని చంద్రబాబు అన్నారు. జగన్ వస్తే రాయలసీమ ఎడారిగా మారిపోతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
అలాగే మోది గెలిస్తే మైనార్టీలకు ఇబ్బందులు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. జగన్కి ఓటేస్తే నరేంద్ర మోదికి ఓటు వేసినట్లేనని పేర్కొన్నారు. మళ్లీ మోది వస్తే దేశంలో ముస్లింలకు ఓట్లే లేకుండా చేస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మైనార్టీల కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
కేసిఆర్ మన ఆస్తుల్లో వాటా ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపించారు. నెత్తిన అప్పుపెట్టి మనల్ని తరిమేశారని విమర్శించారు. జగన్ జుట్టు మోది, కేసిఆర్ చేతిలో ఉందని, వాళ్లు ఏం చెప్తే అది జగన్ చేస్తారని చంద్రబాబు అన్నారు. అందుకే మోది మళ్లీ అధికారంలోకి వస్తాడని జగన్ అంటున్నారని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి మోది నమ్మకద్రోహం చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే జగన్ ఏపి ద్రోహి అని ఆయన విమర్శించారు.
పింఛన్లు, పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ ఆపాలని వైసిపి నేతలు కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారనీ, ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారనీ చంద్రబాబు గుర్తుచేశారు. వాళ్లు ఓట్ల కోసం మీ వద్దకు వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు.