(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి : రాష్ట్రంలో ఉగాది పండుగ నాడు చారిత్రాత్మకంగా నిర్వహిస్తున్న 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణి చేసే కార్యక్రమానికి రావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఎపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు. హస్తిన పర్యటనకు వెళ్లిన సీఎం జగన్..ప్రధాని నరేంద్రమోదీతో ఆయన నివాసంలో గంటన్నరకు పైగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబందించిన వివిధ అంశాలపై ప్రధానికి ఆయన నివేదించారు. విభజన అంశాలు, ప్రత్యేకహోదా, పోలవరం నిధులు తదితర అంశాలపై సీఎం వినతి పత్రం అందజేశారు.
నవరత్న పథకాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు అందజేయాలనే ఉద్దేశంతో ఇల్ల స్థలాలు పంపిణీ చేయనున్నట్లు ప్రధానికి సీఎం తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో 800 ఎకరాల ఉప్పు భూములను ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాల్సిందిగా సీఎం కోరారు. ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా సంబంధిత కేంద్రమంత్రిత్వ శాఖను ఆదేశించాలని జగన్ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి, అసమతుల్యతను తొలగించి సమగ్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానికి సీఎం తెలిపారు. దీని కోసం పరిపాలన వికేంద్రీకరణ చేపట్టామనీ, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ కోసం ప్రణాళికలు రూపొందించుకున్నామనీ వినతి పత్రంలో పేర్కొన్నారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మోదీకి తెలిపారు. దీనికి ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ-అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి చట్టం 2020కి అసెంబ్లీ ఆమోదముద్ర వేసిందని జగన్ వివరించారు.
శాసనమండలి రద్దు అంశాన్ని సీఎం వినతి పత్రంలో పేర్కొన్నారు. గడిచిన రెండు నెలల్లో పరిణామాలను చూస్తే శాసనమండలి ప్రజల మంచి కోసం, మెరుగైన పాలన కోసం ప్రభుత్వానికి సలహాలివ్వాల్సింది పోయి అడ్డుపడే ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రూపొందించిన బిల్లులను మండలి అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో మూడింట రెండొంతుల మెజారిటీతో శాసన మండలిని రద్దు చేస్తూ శాసనసభ తీర్మానం చేసిందని సీఎం ప్రధానికి తెలిపారు. ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపామనీ, ఈ అంశంలో తదనంతర చర్యల కోసం కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని మోదీకి జగన్ విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు ఏపీ దిశ చట్టం-2019కు ఆమోదం తెలపాలని కోరారు
2021 నాటికి పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని ప్రధానికి అందజేసిన వినతి పత్రంలో సీఎం పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న అన్ని కుటుంబాలను తరలించడానికి సహాయ, పునరావాస పనులను అనుకున్న షెడ్యూల్ ప్రకారం చేయాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు 55,549 కోట్ల రూపాయలకు చేరిందనీ, దీనిలో ఆర్ అండ్ ఆర్ కోసమే 33010 కోట్ల రూపాయలు అవసరమవుతుందనీ సీఎం తెలిపారు. కేంద్ర జలవనరుల శాఖలోని సాంకేతిక సలహా కమిటీ ఫిబ్రవరి 2019న పోలవరం అంచనాలను 55,549 కోట్ల రూపాయలుగా అంచనా వేసిందని గుర్తు చేశారు. దీనికి పాలనాపరమైన అనుమతులు ఇంకా రాలేదనీ, ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వీలైనంత త్వరగా వీటికి ఆమోదం తెలపాలనీ కోరారు. ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా 3,320 కోట్ల రూపాయలు రావాల్సి ఉందనీ, ఆ మొత్తం విడుదల చేయాల్సిందిగా జలవనరుల శాఖను ఆదేశించాలనీ సీఎం విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రానికి ‘హోదా’ ఇవ్వండి
అభివృద్ధి పరంగా అసమతుల్యతను నివారించడానికి రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని సీఎం కోరారు. ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమైనందున కేంద్రమే తగిన నిర్ణయం తీసుకోవచ్చంటూ 15 వ ఆర్థిక సంఘం పేర్కొన్న విషయాన్ని సీఎం గుర్తు చేస్తూ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని జగన్ కోరారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని జగన్ గుర్తు చేశారు. రాష్ట్రంలో రెవెన్యూ లోటు 22,948.76 కోట్ల రూపాయలుగా కాగ్ అంచనా వేసిందనీ, కేంద్రం నుంచి ఇంకా 18,969.26 కోట్ల రూపాయలు రావాల్సి ఉందనీ, వీలైనంత త్వరగా ఈ మొత్తాన్ని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలనీ వినతి పత్రంలో సీఎం కోరారు. అదే విధంగా పెండింగ్లో ఉన్న గ్రాంట్లను విడుదల చేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక శాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. కడప ఉక్కు కర్మాగారం, రామాయపట్నం పోర్టు, కృష్ణా – గోదావరి నదుల అనుసంధానానికి నిధులు విడుదల చేయాలని జగన్ కోరారు. రాజధాని నిర్మాణానికి 2500 కోట్ల రూపాయలు కేటాయిస్తే కేవలం 1000 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారనీ, మిగిలిన నిధులనూ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలనీ కోరారు. వెనుకబడిన ఏడు జిల్లాలకు గడిచిన ఆరేళ్లలో కేవలం 1050 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారనీ, గడిచిన మూడేళ్ల నుంచి కేటాయింపులు కూడా లేవనీ సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్, కలహండి నమూనాలో నిధులివ్వాలని కోరారు.