అమరావతి: రాష్ట్రంలో తక్కువ ధరకు అమ్ముతామని ముందుకు వచ్చే సోలార్, విండ్ పవర్ కంపెనీలను ప్రోత్సహించాలనీ, దీని వల్ల డిస్కంలకు తక్కువ ధరకే విద్యుత్ దొరుకుతుందనీ, తద్వారా భారం తగ్గుతుందనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ రంగంఫై సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా జెన్కో, ట్రాన్స్కో ఆర్ధిక పరిస్థితులను అధికారులు సిఎంకు వివరించారు. తీవ్ర రుణ భారం, బకాయిలతో నిండిన డిస్కమ్ లను గట్టెంకించే మార్గాలపై ప్రధానంగా చర్చ జరిగింది.
నాణ్యమైన విద్యుత్ను తక్కువ ధరకు అమ్ముతామంటూ ఎవరైనా ముందుకు వస్తే వారితో ఒప్పందాలు కుదుర్చుకోవాలని జగన్ సూచించారు. గత ప్రభుత్వంలో కుదుర్చుకున్న అధిక ధరలు మాదిరిగా కాకుండా రీజనబుల్ ఖరీదుకు ఎవరు అమ్మినా విద్యుత్ను కొనుగోలు చేయాలని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేయదలచుకున్న 10వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్పై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ ప్లాంట్ను విస్తరించడానికి ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ ప్లాంట్ను విజయవంతం చేయడానికి అధికారులు దృష్టిసారించాలన్నారు.
జెన్కో థర్మల్ కేంద్రాలకు నాణ్యమైన బొగ్గు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీని వల్ల ప్లాంట్ల సామర్థ్యం పెరుగుతుందని వివరించారు. థర్డ్పార్టీతో ఈ బొగ్గు నాణ్యతపై ఎప్పటికప్పుడు సర్టిఫై చేయించాలని సీఎం ఆదేశించారు. నాణ్యమైన బొగ్గు రాకపోతే ప్లాంట్ల సామర్థ్యం తగ్గి, తద్వారా ఆర్థికంగా నష్టం ఏర్పడుతుందని చెప్పారు. వచ్చే ఐదేళ్ల తిరక్కుండా రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని నష్టాల నుంచి గట్టెక్కించాలని తెలిపారు. జెన్కోను తప్పకుండా లాభాల బాట పట్టించాలనీ, హైడ్రో రివర్స్ పంపింగ్ ప్రాజెక్టులపైనా దృష్టిపెట్టాలనీ జగన్ చెప్పారు. విద్యుత్ రంగంలో అవినీతికి చోటు లేకుండా చూడాలన్నారు. కృష్ణపట్నం, వీటీపీఎస్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.