రాజమండ్రి: పోలవరం ప్రాజెెక్టు పునరావాస కార్యక్రమాలను వేగవంతంగా, లోపరహితంగా అమలు చేసేందుకు, సమస్యలను వెంటనే పరిష్కరించడానికి ఒక ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు. తక్షణమే ఆ అధికారి బాధ్యతలు తీసుకుని పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేస్తారని సీఎం పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి రాజమండ్రి విమానాశ్రయంలోని ఏటిసి టవర్ భవనంలో అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.
ధవళేశ్వరంకు ఎగువన ఉన్న దేవీపట్నం సహా ఇతర ప్రాంతాల్లో వరద పరిస్థితి గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు. గోదావరిలో 10 నుండి 11 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా పెద్దగా ముంపు ఉండేది కాదనీ, కాని ఈసారి ముంపు ఎక్కువగా ఉందని అధికారులు, ఎమ్మెల్యేలు వివరించారు. కాఫర్డ్యాం కారణంగా ముంపు పెరిగిందని ఎమ్మెల్యేలు సీఎంకు వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా తగిన ప్రణాళిక వేసుకోవాలని అధికారులను సిఎం ఆదేశించారు. ధవళేశ్వరం వద్ద నీటిమట్టాన్ని ప్రామాణికంగా తీసుకోకుండా పోలవరం వద్ద ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టు వద్ద నీటి మట్టాన్ని పరిగణలోకి తీసుకుని, దానికి అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాని సిఎం సూచించారు. వచ్చే వరద, ముంపునకు గురయ్యే ప్రాంతాలను పరిగణలోకి తీసుకుని ఆ మేరకు పోలవరం పునరావాస పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. త్వరగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులకు సిఎం సూచించారు.
ముంపు బాధిత ప్రాంతాల్లోని కుటుంబాలకు ఇప్పుడిస్తున్న సహాయం కాకుండా అదనంగా అయిదు వేల రూపాయల చొప్పున సహాయం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పునరావాస శిబిరాల్లో ఉంటున్న వారికి భోజనాలు, ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీయే కాకుండా అదనంగా అయిదు వేల ఆర్థిక సహాయం అందించాలని సిఎం సూచించారు. ఇళ్లు నష్టపోయినా, పంట నష్టపోయినా వీటికి నిబంధనల ప్రకారం అందే సహాయం కాకుండా ప్రత్యేకంగా అయిదు వేల ఆర్థిక సహాయం ఇవ్వాలని సిఎం చెప్పారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో దాదాపు 70శాతానికి పైగా గిరిజన గ్రామాలున్నాయని పేర్కొంటూ వరదల కారణంగా వారి జీవనోపాథి దెబ్బతిన్నంందున ప్రత్యేకంగా అయిదు వేల రూపాయలు సహాయం అందించాలని నిర్ణయించినట్లు సిఎం తెలిపారు.
ముంపునకు గురైన గ్రామాలకే కాకుండా, వరదల కారణంగా సంబంధాలు తెగిపోయి ఇబ్బందులు పడుతున్న గ్రామాలకూ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని సిఎం ఆదేశించారు.
పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పరిహారంతో పాటు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల్లో సాగు చేసిన పంటలు కూడా వరదల కారణంగా దెబ్బతింటే, అక్కడ వారికీ పరిహారంతో పాటు ఉచితంగా విత్తనాల సబ్సిడీ అందించాలని ఆయన తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటి సిఎంలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, మంత్రులు కన్నబాబు, విశ్వరూప్, అనిల్కుమార్ యాదవ్, రంగనాథరాజు, ఎంపి మార్గాని భరత్, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, ధనలక్ష్మి, బాలరాజు, కారుమూరి నాగేశ్వర్రావు, కొట్టు సత్యన్నారాయణలు పాల్గొన్నారు.