అమరావతి, ఏప్రిల్ 11: ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలలో గురువారం ఉదయం ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాతంగా, సజావుగా కొనసాగింది. 125 అసెంబ్లీ, 25లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు.
పలు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10గంటల వరకూ ఇవిఎంలు సాంకేతిక లోపంతో మోరాయించడంతో ఓటర్లు తీవ్ర అసహానికి గురయ్యారు. పలు ఇవిఎంలకు ఇంజనీర్లు రిపేర్లు చేసి ఏర్పాటు చేయగా కొన్న చూట్ల స్టాండ్ బై ఇవిఎంలను ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియను కొనసాగించారు. మూడు గంటల పాటు ఇవిఎంలు మోరాయించిన కేంద్రాలలో పోలింగ్ వ్యవధి మూడు గంటలు పెంచాలని టిడిపి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని కోరారు. చంద్రబాబు వినతిని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది కొట్టి పారేశారు. సాయంత్రం ఆరు గంటలలోపు క్యూలైన్ లో ఉన్నవారందరికీ అర్ధరాత్రి అయినా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. సాయంత్రం ఆరు గంటల తరువాత కూడా సుమారు 400కేంద్రాలలో వందల సంఖ్యలో ఓటర్లు బారులు తీరి ఉన్నారు. రాత్రి 10గంటల తరువాత కూడా ఈ కేంద్రాలలో పోలింగ్ కొనసాగుతోంది. మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి క్రిస్టియన్ పేట పోలింగ్ కేంద్రంలో ఇవియంలు మోరాయించడం, పోలింగ్ తీవ్ర జాప్యం జరుగుతుండటంపై రాత్రి టిడిపి ఆభ్యర్ధి, ఐటి మంత్రి నారా లోకేష్ అక్కడకు చేరుకుని భైటాయించి నిరసన తెలిపారు. ఇవిఎంలు మోరాయిస్తున్నా ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పోలీస్ల సహకారంతో టిడిపి రిగ్గింగ్కు పాల్పడుతుందంటూ వైసిపి నేతలు ఆరోపణలు చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి, అనంతపురం జిల్లా తాడిపత్రి, ఆళ్లగడ్డ, రాప్తాడు, కర్నూలు, చిత్తూరు జిల్లా పూతలపట్టు, చంద్రగిరి, కృష్ణాజిల్లా గుడివాడ, మైలవరం, విజయనగరం జిల్లా సాలూరు, నెల్లూరు తదితర నియోజకవర్గాల్లో వైసిపి, టిడిపి నేతల మధ్య ఘర్షణలు జరిగాయి. తాడిపత్రిలో జరిగిన ఘర్షణలో టిడిపికి చెందిన ఒక కార్యకర్త మృతి చెందగా వైసిపికి చెందిన కార్యకర్త తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పలు ప్రాంతాల్లో టిడిపి, వైసిపి శ్రేణులు రాళ్లురువ్వుకున్నారు.
ఓటమి భయంతోనే రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి నాయకులు దాడులకు తెగబడుతున్నారని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. టిడిపి ఓటర్లను పోలింగ్ బూత్లకు రాకుండా చేసి తద్వారా రాజకీయ లబ్దిపొందాలని చూస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. మూడు గంటల పాటు ఇవిఎంలు పని చేయని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కూడా చంద్రబాబు డిమాండ్ చేశారు. అనంతపురంలో జనసేన అభ్యర్థి మధుసూధన్ గుప్తా ఇవిఎంలపై పేర్లు సరిగా ముద్రించలేదంటూ ఆగ్రహంతో ఇవిఎంను ఎత్తిపడేసి పగులగొట్టారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
చంద్రబాబు ఆరోపణలను వైసిపి నాయకులు ఖండించారు. ఓటమి సాకు కోసం చంద్రబాబు వెతుకుతున్నారనీ, ఎన్నికల ప్రక్రియ దెబ్బతీసేలా ప్రయత్నిస్తున్నారనీ వైసిపి నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ, వైవి సుబ్బారెడ్డి, ఎంవిఎస్ నాగిరెడ్డి తదితరులు ఆరోపించారు.
ఆళ్లగడ్డలో వైసిపికి చెందిన గంగుల వర్గీయులు తమ వర్గీయులను కిడ్నాప్ చేశారంటూ టిడిపి అభ్యర్థి మంత్రి భూమా అఖిల ప్రియ సోదరి, సోదరుడు ఆందోళన నిర్వహించారు. సత్తెనపల్లిలో స్పీకర్ కోడెల శివప్రసాద్పై వైసిపి వర్గీయులు దాడి చేశారు.
టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు మంత్రి నారా లోకేష్, ఆయన భార్య, వైసిపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తదితర ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సాయంత్రం ఐదు గంటల వరకూ సుమారు 60శాతం పోలింగ్ జరిగినట్లు సమాచారం. 400పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ అర్ధరాత్రి దాటే వరకూ కొనసాగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఘర్షణలు, రిగ్గింగ్ అరోపణలు, ఇవియం సమస్యల కారణంగా పలు కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహిచాలని వినతులు వచ్చాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. వాటిపై శుక్రవారం ఉదయం రిటర్నింగ్ అధికారి, పరిశీలకులతో చర్చించి వారి అభిప్రాయాలను తీసుకొని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించి ఆయా కేంద్రాల రీపోలింగ్ పై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని సిఇఒ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
మావోయిస్టు ప్రభావిత ఏజన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరం పోలింగ్ బూత్లలో సాయంత్రం 4గంటలకు వరకు క్యూలో ఉన్నవారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు.