అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసించే ఉండవల్లి కరకట్ట భవనాన్ని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించడం వివాదాస్పదం అయిన నేపథ్యంలో తామే అనుమతులు ఇచ్చామని జలవనరుల శాఖ తెలియజేసింది. టిడిపి అధినేత చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. డ్రోన్లను ఉపయోగించిన ఇద్దరు వ్యక్తులను చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. దీనిపై టిడిపి నేతలూ ఆందోళన చేశారు. అనుమతులు లేకుండా ప్రైవేటు వ్యక్తులు జడ్ ప్లస్ క్యాటగిరి భద్రత కలిగిన నేత ఇంటి దగ్గర డ్రోన్లు ఎలా ఉపయోగిస్తారని టిడిపి నేతలు ప్రశ్నించారు.
ఈ ఘటనపై చంద్రబాబు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిజిపి గౌతం సవాంగ్కు ఫోన్ చేసి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. హైసెక్యూరిటీ జోన్లో డ్రోన్లు ఎగరడంపై పోలీసు అధికారులను చంద్రబాబు నిలదీశారు. డ్రోన్లు ఎగురవేస్తున్న వ్యక్తులు ఎవరు, వారికి అనుమతులు ఎవరు ఇచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. అనంతరం దీనిపై జలవనరుల శాఖ స్పందించింది. డ్రోన్ ద్వారా విజువల్స్ తామే చిత్రీకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వరద పరిస్థితిపై తాజా అంచనా కోసమే విజువల్స్ తీయమన్నట్లు వెల్లడించారు.
మరో వైపు డ్రోన్లు ప్రయోగించిన వారు సైతం తాము అధికారుల ఆదేశాల మేరకే డ్రోన్లతో చిత్రీకరించామనీ, నిన్న జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కూడా తామే చిత్రీకరించామని తెలిపారు.