అమరావతి: రాజధాని ప్రాంత రైతులు కౌలు కోసమే అందోళన చేస్తున్నారనీ, వారికి వారం పది రోజుల్లో కౌలు సొమ్ము చెల్లిస్తామనీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. విశాఖలో ఇటీవల బొత్సా రాజధానిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. రాజధానిని అమరావతి నుండి తరలించడానికి వీలులేదని రెండు రోజులుగా రైతులు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరో వైపు ప్రతిపక్షాల మద్దతు కూడగట్టే క్రమంలో భాగంగా బిజెపి, జనసేన నాయకులను అమరావతి ప్రాంత రైతులు కలిశారు. రైతుల కోరికపై రేపు రాజధాని ప్రాంతంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి పర్యటించనున్నారు. సెప్టెంబర్ ఒకటి, రెండు తేదీలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం మంత్రి బొత్సా సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రాజధాని ప్రాంత రైతులు కౌలు కోసమే ఆందోళన చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. కొందరు రైతులు తనను కూడా కలిశారని బొత్సా చెప్పారు. ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో చర్చించామనీ, తక్షణం కౌలు చెల్లింపుకు చర్యలు తీసుకోవాలని సిఎం చెప్పారని బొత్సా తెలిపారు.
రాజధాని ప్రాంతంలో భూముల విషయంలో అక్రమాలు జరిగాయని గతంలో తమ పార్టీతో పాటు బిజెపి, జనసేన కూడా ఆరోపించిన విషయాన్ని బొత్సా గుర్తు చేశారు. వాటిపైనే ప్రస్తుతం విచారణ చేస్తున్నామని బొత్సా అన్నారు. అక్రమాలపై విచారణ చేయవద్దని వారు భావిస్తున్నారా అని బొత్సా ప్రశ్నించారు. వ్యక్తులకు గానీ, రాజకీయ పార్టీ నాయకులకు గానీ ఏమైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేయడానికి తాము సిద్ధమని బొత్సా పేర్కొన్నారు. రాజకీయ పార్టీల నాయకులు మొన్న ఒక మాట, నిన్న ఒక మాట, నేడు ఒక మాట మాట్లాడితే వారిని ఎలా అర్థం చేసుకోవాలని బొత్సా అన్నారు. రాజధానిలో జరిగిన అక్రమాలపై వారి వైఖరి ఏమిటో చెప్పాలని బొత్సా కొరారు.