న్యూఢిల్లీ: రాజకీయ ఎజెండాల కోసం, రాజకీయ లక్ష్యాల కోసం సాయుధ బలగాల పేరు వాడుకోవడం సబబుగా లేదంటూ 150 మందికి పైగా వెటరన్ సైన్యాధికారులు రాష్ట్రపతి రామనాధ్ కోవింద్కు లేఖ రాశారు. ముగ్గురు మాజీ ఆర్మీ చీఫ్లు ఎస్ఎఫ్ రోడ్రిగ్స్, శంకర్ రాయ్ చౌధరి, దీపక్ కపూర్ దీనిపై సంతకాలు చేసిన వారిలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల మొదటిదశ పోలింగ్ జరిగిన గురువారం నాడు ఈ లేఖ పంపారు.
సరిహద్దుకావల జరిగే సైనిక దాడుల ఘనతను రాజకీయ నాయకుల తమకు ఆపాదించుకుంటున్నారనీ, సేనలను ‘మోదీజీ కీ సేన’ అంటున్నారనీ ఆ లేఖలో మాజీ సైనికాధికారులు పేర్కొన్నారు. ఈ పరిణామాలు సేనలలో, మాజీ సైనికులలో ఆందోళనకూ, కలవరానికీ దారి తీశాయని వారు పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పార్టీ కార్యకర్తలు సైనికుల యూనిఫారంలు ధరించడం, సైనికుల ఫొటోలతో, ప్రధానంగా ఎయిర్ఫోర్స్ పైలట్ అభినందన్ వర్ధమాన్ ఫొటోతో పోస్టర్లు ముద్రించడం ఆందోళనకరమని కూడా మాజీ సైనికాధికారులు పేర్కొన్నారు.
ఎన్నికల కమిషన్ మందలింపులు పెద్దగా పనిచేసినట్లు లేదని వారు వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా సెక్యులర్ పద్ధతిలో వ్యవహరించే సైనిక బలగాల ఆ గుర్తింపును కాపాడాల్సిందిగా అందులో రాష్ట్రపతిని కోరారు. ఆర్మీ, మిలటరీ యూనిఫారంలు, మిలటరీ ఆపరేషన్స్ గుర్తులను రాజకీయపార్టీలు వాడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.