అమరావతి: నాయకుల జాతకాలు ఈవిఎంలో నిక్షిప్తం అయ్యాయి.
రాష్ట్రంలో 25లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్ధుల భవితవ్యానికి ఓటర్లు తమ తీర్పును ఈవియంలపై మీట నొక్కడం ద్వారా వెల్లడించారు.
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా పలు ప్రాంతాల్లో ఈవిఎంల మోరాయింపు, హింసాత్మక సంఘటనలు జరిగినప్పటికీ పోలింగ్ శాతం పెరిగింది. ఈవిఎంల్లో సాంకేతిక లోపం తలెత్తి ఆలస్యంగా ప్రారంభమయిన పోలింగ్ కేంద్రాల్లో గురువారం అర్థరాత్రి దాటిన తరువాత కూడా పోలింగ్ కొనసాగింది. తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలన్న భావనతో సాయంత్రం ఆరు గంటల నుండి సుమారు ఆరు గంటల పాటు అర్థరాత్రి వరకూ క్యూలైన్లో వేచి ఉండి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సాయంత్రం 6గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో 71.43శాతం ఓట్లు పోల్ అవ్వగా, పోలింగ్ పూర్తి అయ్యే సమయానికి 76.69 శాతం నమోదు అయ్యింది.
పోలింగ్ పర్సెంటేజీ పెరగడంతో పాటు యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం పెరగడం తమకు లాభం అంటే తమకు లాభం అని టిడిపి, వైసిపి నేతలు ప్రకటించుకుంటున్నారు.
విజయం తమదేనంటూ టిడిపి అధినేత, మఖ్యమంత్రి చంద్రబాబు, వైసిపి అధినేత వైఎస్ జగన్లు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికలకు భిన్నంగా ఈ సారి వైసిపి కూడా గ్రామాల్లో పోల్ మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని టిడిపికి ధీటుగా నిర్వహించిందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఎక్కవ ప్రాంతంలో ఫ్యాన్ గాలి వీచిందని వినబడుతోంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగానే ఎక్కువ శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని వైసిపి నేతలు పేర్కొంటున్నారు.
ప్రభుత్వం అందించిన పసుపు కుంకుమ, నిరుద్యోగ భృతి, ఫించన్ల పెంపు, రైతు రుణ మాఫీ తదితర పథకాల వల్ల ఓటర్లు టిడిపి ప్రభుత్వం మరలా రావాలని కోరుకుంటున్నారనీ, అందుకే పోలింగ్ శాతం పెరిగిందని టిడిపి నేతలు వాదిస్తున్నారు.
ఈ ఎన్నికలను అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహప్రతివ్యూహలతో ఓటర్లకు తాయిలాలు ప్రకటిస్తూ మేనిఫెస్టోను రూపొందించి ముందుకు సాగాయి. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా నేతల భవితవ్యం ఈవిఎంలలో నిక్షిప్తమయ్యింది.
ఓటర్లు వెల్లడించిన తీర్పు తెలుసుకోవడానికి మరో ఐదు వారాలు వేచి చూడాల్సిందే.