హైదరాబాద్: జమ్ము కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీని, హోంమంత్రి అమిత్ షాను శ్రీకృష్ణుడు, అర్జునుడితో పోల్చిన సూపర్ స్టార్ రజనీకాంత్పై మజ్లిస్ పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ వ్యంగ్యవ్యాఖ్యలు చేశారు. మరి పాండవులు, కౌరవులు ఎవరో అని ఆయన అన్నారు.
ఆర్టికల్ 370ను నిర్వీర్యం చేసినందుకు రజనీకాంత్ మోదీని, అమిత్ షాను ప్రశంసించారు. వారిద్దరూ కృష్ణుడు, అర్జునుడి వంటి వారు. ఎవరు కృష్ణుడో, ఎవరు అర్జునుడో మాత్రం తెలియదు అని రజనీకాంత్ అన్నారు.
బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ లోని తన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ అసదుద్దీన్ ఈ రజనీకాంత్ వ్యాఖ్యలు ప్రస్తావించారు. ఈ దేశంలో మరో మహాభారత యుద్ధం జరగాలని కోరుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు.
ఈ ప్రభుత్వానికి కశ్మీరీలపై ప్రేమ లేదని తెలుసు. వారికి కశ్మీర్ భూమి మీద ప్రేమ, కశ్మీరీలపై కాదు. అధికారంపై ప్రేమ. న్యాయం మీద కాదు. అధికారాన్ని నిలుకోవడమే వారికి కావాల్సింది. అయితే ఎవరూ కూడా ఎల్లకాలం పాలించరని గుర్తుంచుకుంటే మంచిది అని అసదుద్దీన్ పేర్కొన్నారు.