చెన్నై: కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ ని తెగిన చెప్పుతో కొట్టాలంటూ అన్నాడీఎంకే నేత, మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులోని నంగునూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ సందర్భంగా అన్నాడీఎంకే కార్యకర్తల సమావేశంలో రాజేంద్ర బాలాజీ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘నంగునూరు కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఢిల్లీలో కూర్చుని ఖరారు చేస్తున్నట్టుంది. మాణిక్యం ఠాగూర్ అనే ఓ పనికిమాలిన వ్యక్తి ఇప్పుడు ఎంపీ కూడా. ఈ సారి ఓట్లు అడగడానికి వస్తే తెగిన చెప్పులతో కొట్టండి’ అని వ్యాఖ్యానించారు.
లోక్సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇంతవరకు నియోజకవర్గానికి కూడా రాలేదని మంత్రి రాజేంద్ర బాలాజీ ధ్వజమెత్తారు. అంతేకాదు కాంగ్రెస్ ఎంపీని పందితో పోల్చారు. ‘ఎన్నికల్లో ఓట్లు అడగడానికి రాలేదు. గెలిచిన తర్వాత కనీసం కృతజ్ఞత చెప్పడానికి కూడా రాలేదు. ఆయన కుటుంబం కూడా ఢిల్లీలోనే ఉంటుంది. మాణిక్యం కేవలం ఢిల్లీలో కూర్చుని పత్రికా ప్రకటనలు రిలీజ్ చేస్తుంటాడు. ఆ పంది ఇక్కడకు వస్తే కాల్చేయండి. సాధారణంగా పందులను చంపడానికి రబ్బర్ బుల్లెట్స్ వాడతాం. ఈ పందిని చంపడానికి మీరు కూడా రబ్బర్ బుల్లెట్స్ వాడండి.’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇదిఇలా ఉంటే.. తమిళనాడులోని నంగునూరు, విక్రవాండి అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 24న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ రెండు నియోజకవర్గాలకు అన్నాడీఎంకే అభ్యర్థులను ఖరారు చేసింది.