- బాలికపై కారులో నలుగురి అత్యాచారం
- ఆసుపత్రిలో చికిత్స.. పరిస్థితి విషమం
- మాకు కొంత సమయం ఇస్తారా.. లేదా?
- అరెస్టులపై మీడియాతో పోలీసు అధికారి
బులంద్ శహర్: ఉత్తరప్రదేశ్ లోని బులంద్ శహర్ ప్రాంతంలో ఓ టీనేజి బాలిక(15)పై కారులో నలుగురు అత్యాచారం చేశారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ బాలికను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఆమెపై అత్యాచారం జరిగిన విషయాన్ని వైద్యులు నిర్ధరించారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు గానీ ఇంతవరకు ఎవరినీ అరెస్టుచేయలేదు. ఘటన జరిగిన 48 గంటల తర్వాత కూడా ఎందుకు అరెస్టు చేయలేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దానికి పోలీసు అధికారి నుంచి వింత సమాధానం ఎదురైంది. ‘అన్నా, పోలీసులకు కాస్త సమయం ఇస్తారా.. ఇవ్వరా?’ అని పోలీసు చీఫ్ ఎదురు ప్రశ్నించారు.
తన అన్నతో కలిసి మోటారుసైకిల్ మీద తిరిగి వస్తుండగా బాలికను రోడ్డు మీద నుంచి కిడ్నాప్ చేశారు. నింితులు తొలుత మోటారుసైకిలును తమ కారుతో ఢీకొట్టారు. ఇద్దరూ కింద పడగానే ముందుగా అబ్బాయిని కొట్టి, తాళ్లతో కట్టేసి పొలాల్లోకి విసిరేశారు. తర్వాత బాలికను బలవంతంగా కారులోకి ఎక్కించారు. 24 గంటల తర్వాత.. కిడ్నాపైన ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరంలో బాలిక కనిపించింది. నాటుతుపాకులు పట్టుకున్న ముగ్గురు తమను బెదిరించి, రూ. 20వేలు దోచుకుని, తన చెల్లెలిని తీసుకుపోయారని ఆమె అన్న చెప్పాడు. బాలిక స్పృహలోకి రాలేదని, తాము ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నామని బులంద్ శహర్ పోలీసు అధికారి ఎన్.కొలాంచి చెప్పారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని, కారు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. బులంద్ శహర్ ప్రాంతంలోనే 2016 ఆగస్టులో ఒక మహిళ, ఆమె కుమార్తె ఇద్దరిపై 3 గంటల పాటు గ్యాంగ్ రేప్ జరిగింది. ఇప్పుడూ అదే తరహా ఘటన చోటుచేసుకుంది.