ముంబై: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వస్తుంది గానీ, నరేంద్రమోదీ మాత్రం ఈసారి ప్రధాని కాబోరని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని జోస్యం చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సినంత బలం మాత్రం ఆ పార్టీకి ఉండకపోవచ్చని చెప్పారు. మిగిలిన పార్టీల మద్దతు లేకుండా బీజేపీ ఒక్కటీ ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. ఒకవేళ అలాంటి సందర్భమే ఎదురైతే.. ఆయా పార్టీలు వేరే ఎవరినో ప్రధానిగా ప్రతిపాదిస్తాయని పవార్ అన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ ఒక్క పార్టీకే ఏకంగా 283 స్థానాలు వచ్చాయి. ఎన్డీయేకు 326 స్థానాలు వచ్చాయి. దాంతో బీజేపీ కావాలనుకుంటే ఒక్కటే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలిగే పరిస్థితి ఉండేది.
మహారాష్ట్రాలోని 48 స్థానాలకు గాను 45 తమ కూటమే గెలుచుకుంటుందని అమిత్ షా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన తప్పు చెప్పి ఉంటారని, మొత్తం 48 వాళ్లకే వస్తాయని చెప్పాలని పవవార్ ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని మరాఠా నాయకుడు పవార్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దానికి బదులు తన కూతురు సుప్రియా సూలే, మనవడు పోటీ చేస్తారని చెప్పారు. కుటుంబ పరిస్థితుల వల్ల తాను పోటీ చేయబోవడం లేదన్నారు.