న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపించడంతో రాజకీయ పార్టీలన్నీ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఇటీవలి కాలంలోనే ఫేస్ బుక్ లాంటి వాటిలో దాదాపు కోటిన్నర రూపాయలు పెట్టి రాజకీయాలు, ఇతర జాతీయ ప్రాధాన్యాంశాలకు సంబంధించిన ప్రకటనలు ఇచ్చారు. వీటిలో టాప్ 20 పేజీలో రూ. 1.1 కోట్లు ఖర్చుపెట్టాయి. మొదటి స్థానంలో ‘మై ఫస్ట్ ఓట్ ఫర్ మోదీ’ ఉండగా, రెండోస్థానంలో వైసీపీ అనుకూలంగా ఉండే ఐప్యాక్ (రూ. 17.52 లక్షలు), మూడో స్థానంలో బీజేపీ అనుకూల ‘భారత్ కే మన్ కీ బాత్’ (రూ. 9.68 లక్షలు) ఉన్నాయి. మార్చి 17 నుంచి 23 వరకు.. వారం రోజుల పాటు ఎక్కువ ఖర్చుపెట్టిన టాప్ 20 పేజీల వివరాలు కింద పట్టికలో ఉన్నాయి. వాటిని అంతకుముందువారంతో కూడా పోల్చారు.
బీజేపీ అనుకూల ఫేస్ బుక్ పేజీ ‘నేషన్ విత్ నమో’ గత వారం కంటే ప్రకటనల ఖర్చు బాగా తగ్గించింది. మొత్తమ్మీద బీజేపీ అనుకూల పేజీల ఖర్చు అంతా కలిపి రూ. 67 లక్షలుండగా, వైసీపీ అనుకూల పేజీల ప్రకటనలు రూ. 24 లక్షలున్నాయి. తర్వాత బీజేడీ (రూ. 10.5 లక్షలు), కాంగ్రెస్ (రూ. 8 లక్షలు) ఉన్నాయి.
ఇదంతా ఒక ఎత్తయితే, బీజేపీ మాత్రం సోషల్ మీడియా పేజీలలో ఓటు వేస్తే ఉచిత బహుమతులు ఇస్తామంటూ ఓటర్లను ప్రలోభపెడుతోంది. ఈ విషయాన్ని ‘ఆల్ట్ న్యూస్’ వెబ్ సైట్ బయటపెట్టింది. ‘మై ఫస్ట్ ఓట్ ఫర్ మోదీ’ పేజీని ఎన్నికలకు మూడు నెలల ముందే ప్రారంభించారు. అందులో ప్రధాని నరేంద్రమోదీకి ఓటు వేస్తామని ప్రతిన చేస్తే ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తామని ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. వాటిలో బ్యాడ్జీలు, బ్యాగులు, టీషర్టులు, ఫోన్ కవర్లు, టోపీలు.. ఇలాంటివన్నీ ఉన్నాయి. ‘‘మెరుగైన భారతదేశం కోసం పీఎం మోదీకి మీ తొలి ఓటు వేస్తామని చెప్పండి, అబ్బురపరిచే బహుమతులు గెలుచుకోండి’’ అని అందులో ఉంది.
అయితే, ఇంతకుముందు ఈ వస్తువులన్నీ ప్రధాని అధికారిక వెబ్ సైట్ లో కూడా అమ్మకానికి ఉన్నాయి. అవి ‘నమో మర్కండైజ్’లో భాగంగా ఉండేవి. వాటినే ఇప్పుడు ఉచితంగా ఇస్తామంటున్నారు. ‘నేషన్ విత్ నమో’, ‘మై ఫస్ట్ ఓట్ ఫర్ మోదీ’ రెండూ ఒకే బ్రాండుకు సంబంధించినవని తెలుస్తోంది. ఆ ప్రకటనలో ‘మై ఫస్ట్ ఓట్ ఫర్ మోదీ’ లోగో కూడా ఉంది.
ఎన్నికల చట్టాల ఉల్లంఘనేనా?
‘నేషన్ విత్ నమో’, ‘మై ఫస్ట్ ఓట్ ఫర్ మోదీ’ రెండు పేజీల ప్రకటనకర్తల చిరునామా బీజేపీ ప్రధాన కార్యాలయమే ఉన్న విషయం ఇంతకుముందు కథనంలో చెప్పాం. కానీ బీజేపీ మాత్రం ఈ పేజీలతో ప్రత్యక్ష సంబంధం ఉందని ఇంకా చెప్పలేదు. 2019 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఈ రెండు పేజీలకు రూ. 1.8 కోట్ల ప్రకటనలొచ్చాయి. అయితే, ఈ రెండు పేజీలలోనూ ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తామని చెప్పడం మాత్రం కచ్చితంగా ఓటర్లకు తాయిలాలు ఇవ్వడమే. ‘‘ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఓటర్లను ఎలాంటి ఆపర్లతో ప్రలోభపెట్టకూడదు. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారా అనన విషయాన్ని పరిశీలించాల్సిందే’’ అని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎస్ కృష్ణమూర్తి చెప్పారు.