(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతున్న వేళ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆర్టీసీ సమ్మెపై కేంద్రానికి లక్ష్మణ్ నివేదిక సమర్పించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు పలువురు కేంద్ర మంత్రులను లక్ష్మణ్ కలవనున్నారు. కేంద్రం ఆర్టీసీ సమ్మెపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటోదని తెలుస్తోంది. కరీంగనర్ ఎంపీ బండి సంజయ్ విషయంలో పోలీసుల ఓవరాక్షన్పై బీజేపీ పెద్దలు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా లక్ష్మణ్కు హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాను కలిసి… రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె, తాజా పరిణామాలను వివరించబోతున్నారు లక్ష్మణ్. ముఖ్యంగా కరీంనగర్లో ఆర్టీసీ డ్రైవర్ నగునూరి బాబు అంతిమయాత్రలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మీద ఓ పోలీసు అధికారి చేయిచేసుకున్న అంశాన్ని కేంద్ర పెద్దల ముందు పంచాయతీ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
ఆర్టీసీ డ్రైవర్ బాబు అంత్యక్రియల సందర్భంగా శుక్రవారం(నవంబర్ 1) కరీంనగర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. అంత్యక్రియల సందర్భంగా నిర్వహించిన శవయాత్రలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. అయితే ర్యాలీగా వెళ్తున్న నేతలను అడ్డుకున్న పోలీసులు పాడెను దారి మళ్లించారు. కుటుంబ సభ్యులను మాత్రమే స్మశాన వాటికలోకి అనుమతించారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం,తోపులాట చోటు చేసుకున్నాయి. శవయాత్ర సందర్భంగా పోలీసులతో జరిగిన తోపులాటలో రామగుండం కమిషనరేట్కి చెందిన ఏఆర్ డీఎస్పీ నాగయ్య తనపై చేయి చేసుకున్నారని ఎంపీ బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పలు ఫోటోలను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు. తనపై దాడికి సంబంధించి పోలీస్ కమిషనర్ సత్యనారాయణకు ఎంపీ ఫిర్యాదు చేశారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ సీపీ కార్యాలయం ముందు బైఠాయించారు. ఆ సమయంలో అక్కడి డీసీపీ తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు సంజయ్ ఆరోపించారు. పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించడంపై పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపడుతానని ఎంపీ బండి సంజయ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ,కేంద్రమంత్రులు అమిత్ షా,జేపీ నడ్డా,కిషన్ రెడ్డి దృష్టి సారించాలని కోరారు.
Iam requesting @narendramodi Ji @AmitShah Ji @JPNadda Ji @kishanreddybjp Ji to look into this grave issue of the TSRTC Strike & the abhorrent acts of TSPolice. In this regard,Iam going to raise a Privilege Motion against the vicious acts of TSPolice in upcoming Parliament session pic.twitter.com/PXxIPJnBsS
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 1, 2019
తెలంగాణలో మంచి ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న బీజేపీకి.. ఆర్టీసీ సమ్మె, శుక్రవారం(నవంబర్ 1) నాటి పరిణామాలు రాజకీయంగా కలిసొచ్చేలా ఉన్నాయి. మొన్నటి హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకపోవడంతో… ఢిల్లీ హైకమాండ్… రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై సీరియస్గా ఉన్న సమయంలో… సమ్మె ద్వారా తిరిగి ప్రజా మద్దతు కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దీనికి కేంద్రం కూడా సపోర్టుగా నిలిస్తే… ఈ అంశాన్ని రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, కేంద్ర పెద్దలు ఎలాంటి వ్యూహాలు రచిస్తారన్నదాన్ని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.