(న్యూస్ అర్బిట్ బ్యూరో)
హైదరాబాద్: ఒకపక్క ముఖ్యమంత్రి కెసిఆర్ తాను పౌరసత్వ సవరణ చట్టా(సిఎఎ)నికి వ్యతిరేకమని చెబుతారు. మరోపక్క హైదరాబాద్ పోలీసులు సిఎఎను నిరసించే కార్యకర్తలను అరెస్టు చేస్తారు. నాలుగు గోడల మధ్య జరగనున్న ఒక నిరసన సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన భీమ్ ఆర్మీ నేత చంద్రశేఖర్ ఆజాద్ను నగర పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
సిఎఎకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నందుకు గతంలో ఢిల్లీ పోలీసులు ఆజాద్ను అరెస్టు చేసారు. ఒక ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన కొద్ది రోజుల క్రితమే విడుదల అయ్యారు. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసారు.
నిరసన కార్యక్రమానికి అనుమతి లేని కారణంగా ఆజాద్ను అరెస్టు చేశామని లంగర్ హౌజ్ పోలీసులూ చెప్పారు. మల్లేపల్లి ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ నుంచి ఆయనను అరెస్టు చేసి హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. క్రమంగా అక్కడ జనం పోగవడంతో ఆజాద్ను మరో స్టేషన్కు తరలించారు.