అమరావతి: ఏపీలో పెద్దల సభను ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేదా? అనే అంశంపై సోమవారం కీలక నిర్ణయం వెలువడనుంది. సోమవారం శాసనసభలో మండలి అంశంపై ప్రత్యేక చర్చ జరగనుంది. ఈ సమావేశానికి ముందు ఉదయం 9.30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమవుతుంది. మండలి రద్దు అంశంపై చర్చించి ఆమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశంలో మండలి రద్దుపై తీర్మానం చేసే అవకాశాలున్నాయి. అనంతరం దాన్ని కేంద్రానికి పంపే యోచనలో వైసీపీ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే సీఎం జగన్ సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం మండలి రద్దు నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. ప్రజాభిప్రాయానికి, చట్టసభల నిబంధనలకు, ప్రజలు ఎన్నుకున్న శాసనభకు వ్యతిరేకంగా పనిచేస్తున్న శాసన మండలి అవసరమా అని జగన్ ఇటీవల అసెంబ్లీలో ప్రశ్నించారు. దీనిపై చర్చించేందుకే ప్రత్యేకంగా సోమవారం సమావేశం అవుతోంది. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం మేరకు 99 శాతం మేర మండలిని రద్దు చేసే దిశలోనే సీఎం జగన్ ఉన్నారని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. జనవరి 23న అసెంబ్లీ వాయిదా పడినప్పటి నుంచి జరిగిన పరిణామాలను చూస్తే మండలి రద్దుకే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి సమావేశాలకు దూరంగా ఉండాలని ఇప్పటికే టీడీపీ నిర్ణయించింది.
ఏపీలో మూడు రాజధానులకు సంబంధించిన సీఆర్డీఏ రద్దు, అధికార, పాలనా వికేంద్రీకరణ బిల్లులపై శాసనమండలిలో చోటు చేసుకున్న పరిణామాలపై వైసీపీ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. శాసనసభలో ఆమోదం పొందిన బిల్లులను.. శాసనమండలిలో తిరస్కరణకు గురికావడం ముఖ్యమంత్రికి మింగుడుపడలేదు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని మండలి చైర్మన్ షరీఫ్ తీసుకున్న నిర్ణయంపై వైసీపీ ప్రభుత్వం రగిలిపోతోంది. మండలి చైర్మన్, టీడీపీ సభ్యుల తీరును తీవ్రంగా తప్పుబట్టిన సీఎం జగన్.. అసలు శాసన మండలి అవసరమా? అని ప్రశ్నించారు. దీని వల్ల ఏడాదికి రూ. 60 కోట్ల ఖర్చు అవుతుందని, లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఇంత ఖర్చు అవసరమా అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే శాసనమండలిని రద్దు చేయాలన్న యోచనలో జగన్ ఉన్నారు. అయితే, దీనిపై మంత్రివర్గంలో తీసుకునే వైఖరికి అనుగుణంగా అసెంబ్లీలో సీఎం తుది నిర్ణయాన్ని ప్రకటిస్తారు.
మండలి రద్దుపై సీఎం చేసిన వ్యాఖ్యలకు మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు సైతం మద్దతుగా నిలిచారు. మండలి సభ్యుడిగా ఉండి, మంత్రిగా పనిచేస్తున్న పిల్లి సుభాష్చంద్రబోస్ సైతం ఏకంగా మండలిని రద్దు చేసేయాలని కోరారు. అలాగే గత మూడు రోజులుగా మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అంబటి రాంబాబు సైతం మండలి ఉండొచ్చు? ఉడిపోవచ్చు? అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సైతం శాసన మండలి రద్దును ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో చర్చ జరిగిందని, దీనిపై కీలక నిర్ణయం తీసుకునే ముందు అన్ని వర్గాల సలహాలు తీసుకుంటే మంచిదని సమయమిచ్చినట్లు చెప్పారు.
ఒకవేళ శాసనమండలి రద్దుకే మొగ్గు చూపితే అది వైసీపీకే ఎక్కువ నష్టమని విపక్షాలు వాదిస్తున్నాయి. మరో ఏడాది తర్వాత శాసనమండలిలో ప్రస్తుతం ఉన్న సభ్యులలో అధికుల పదవి కాలం పూర్తి కానుంది. దీంతోమండలిలో ఖాళీలు ఏర్పడతాయి. ఆ స్థానాల్లో వైసీపీ సభ్యులు భర్తీ అవుతారు. వైసీపీలో శాసనసభ్యులకు ధీటైన స్థాయిలో ఉన్న నేతలకు శాసనమండలిలో స్థానం కల్పించడం ద్వారా నేతలందరికీ పదవులు ఇచ్చి సంతృప్తి పరచేందుకు వీలుకలుగుతుంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి పార్టీ ముఖ్యనేతలు వివరిస్తున్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్సీలు కలిసివస్తే మండలి రద్దుపై పునరాలోచించవచ్చన్న అభిప్రాయాన్ని కొందరు ముఖ్య నేతలు పార్టీ అధినాయకత్వం వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం. 2021 జూన్ నాటికి మండలిలో అధికార పక్షానికి సంఖ్యా బలం పెరిగే అవకాశం ఉందన్న విషయాన్నీ వారు గుర్తుచేస్తున్నారు. కానీ అప్పటి వరకూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మండలిలో ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి కదా? అని ముఖ్యమంత్రి తన అభిప్రాయాన్ని గట్టిగానే చెబుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
మరోవైపు శాసనమండలి రద్దయితే ప్రస్తుత మంత్రులు పిల్లి సుభాశ్చంద్రబోస్ .. మోపిదేవి వెంకటరమణారావు వంటివారు తమ ఎమ్మెల్సీ స్థానాలు కోల్పోతారు. మండలిని రద్దు చేస్తే కౌన్సిల్ నుంచి మంత్రులుగా ప్రాతినిథ్యం వహిస్తున్న వారి పరిస్థితి ఏంటనే ప్రశ్న వ్యక్తం అవుతోంది. అయితే, వారి కోసం ప్రస్తుత ఎమ్మెల్యేల్లో ఇద్దరు తమ స్థానాలు ఖాళీచేసి, ఆరునెలల్లో వాటికి ఎన్నికలు జరిగితేనే వారు మంత్రివర్గంలో కొనసాగే వీలుంటుంది.
అయితే మొదటి నుంచి తనను నమ్ముకుని ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను మండలి నుంచి మంత్రులుగా తీసుకున్నారు సీఎం జగన్. వీరిద్దరూ గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో సైతం మంత్రులుగా పనిచేశారు. వీరిలో సుభాష్ చంద్రబోస్ ఇప్పటికే మండలి రద్దు చేయాలని కోరగా, మోపిదేవి తన స్వభావరీత్యా మౌనంగా ఉన్నారు. అయితే వీరిద్దరూ మంత్రి పదవులు కోల్పోయినా సీఎం జగన్ వారిని పార్టీకి కానీ, ఇతర కీలక వ్యవహారాలకు ఉపయోగించుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. శాసన మండలి రద్దుపై సీఎం జగన్ సూత్రప్రాయం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.