అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలోని 30 అంశాలకు సంబంధించి నిర్ణయాలపై సమీక్షించేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ మంత్రివర్గ ఉపసంఘంతో వైఎస్ జగన్ నేడు తొలి సమావేశం నిర్వహించారు.
కార్పొరేషన్లలో తీసుకున్న కీలక నిర్ణయాలు, మైనింగ్ లీజులు, సాగనీటి ప్రాజెక్టుల ఒప్పందాలు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రారంభించిన పథకాలు, ఐటీ ప్రాజెక్టులు, భూకేటాయింపులు, పోలవరం, సిఆర్డిఎ, విమానాశ్రయాల టెండర్లపై ఉప సంఘం సమీక్షించనుంది.
రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థల సహకారంతో ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని గడువు విధించిన జగన్ విచారణలో దృష్టి సారించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో ఉప సంఘం సభ్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కురసాల కన్నబాబు, అనిల్ కుమార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గౌతంరెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ప్రభాకర్రెడ్డి, ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు.