హైదరాబాద్: ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పల్నాటి పులి అని, అవమానాలు భరించలేకే కోడెల తనువు చాలించారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కోడెల శివప్రసాద్ భౌతికకాయానికి చంద్రబాబుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. కోడెలది ప్రభుత్వం చేసిన హత్య అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. దేశ చరిత్రలో ఓ సీనియర్ నాయకుడిని ఇలా ఎక్కడా వేధించలేదన్నారు. కోడెల లాంటి వ్యక్తికి ఇలాంటి ముగింపు రావడం బాధాకరమన్నారు. కేసులు, వేధింపులతో కోడెల కుటుంబాన్ని చెల్లాచెదురుచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల తప్పు చేసి చనిపోలేదు, వేధింపులకు గురై చనిపోయారని చంద్రబాబు పేర్కొన్నారు. ఫర్నీచర్ గురించి అసెంబ్లీ కార్యదర్శికి కోడెల నాలుగు లేఖలు రాశారని కానీ అసెంబ్లీ కార్యదర్శి కనీసం స్పందించలేదన్నారు. కోడెలను మానసికంగా వేధించి చంపారన్నారు. వైసీపీది టెర్రరిస్టు ప్రభుత్వం కాదు అంతకంటే ఎక్కువని విమర్శించారు. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు కోడెలను వేధించారని అన్నారు.
రూ.43వేల కోట్లు దోచుకుని, 11 చార్జిషీట్లలో జగన్ ముద్దాయన్నారు. కేవలం రూ.లక్ష, రెండు లక్షలు విలువైన ఫర్నిచర్ విషయంలో…కోడెల శివప్రసాదరావుపై కేసులు పెట్టడం శోచనీయమన్నారు. కోడెల ఇప్పటికీ అద్దె ఇంట్లో ఉంటున్నారని, రెండు నెలల్లో ఏకంగా 19 కేసులు పెట్టారన్నారు. లక్ష రూపాయల ఫర్నీచర్ కోసం ఆత్మహత్య చేసుకునేలా చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘మనిషిని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వేధించి, వేధించి, ఇంక దిక్కు తెలియకుండా, ఏం చేయాలో ముందుకు పోనీయకుండా లైఫ్ ను ఎండ్ చేసుకోవడం. ఈ కేసు చూసినప్పుడు… ఒకప్పుడు పల్నాడు పులి. పల్నాడు టైగర్… ఓ ప్రత్యేకమైన గుర్తింపు. అదే విధంగా ప్రజల దగ్గరి నుంచి, క్యాడర్ దగ్గరి నుంచి రికగ్నిషన్. అలాంటి వ్యక్తి… ఈ రోజు భయపడిపోయాడు. పిరికితనం వచ్చింది. ఈ అవమానాలు చూసిన తరువాత నేను బతకడం వేస్ట్ అనుకున్నారు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
మరే వ్యక్తికీ కోడెలలాంటి పరిస్థితి రాకూడదన్నారు. వైసీపీ ప్రభుత్వానికి పోలీసులు.. ఆలిండియా సర్వీస్ ఉద్యోగులు సరెండర్ అయ్యారని ఆరోపించారు. తప్పుచేసిన వాడికి శిక్ష వేస్తే తాను అభినందించేవాడినన్నారు. కుమారుడు, కూతురు వేధింపుల వల్లే… కోడెల ఆత్మహత్య చేసుకున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. శివరాం విదేశాల్లో కాకుండా ఇక్కడే ఉండుంటే… కోడెలను ఆయనే చంపాడని కేసులు పెట్టేవారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్మాదిలా వ్యవహరిస్తోందని… కోడెల మృతిపై సీబీఐ విచారణ జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.