ఈ ఆదివారం మధ్యాహ్నం ప్రయాణీకులున్న బోటు గోదారి ఉధృతిలో తిరగబడి ఘోరప్రమాదం జరిగింది. కొన్ని శవాలు దొరికాయి, మరికొందరికోసం గాలింపు నడుస్తోంది. ఈ వార్త పొక్కిన సమయం నుంచి అన్ని ఛానళ్ళు అన్నివేళలా చూపిస్తూ పోతున్నారు. ఇది కొత్త కాదు. ఇలాంటి సంఘటన జరిగినపుడు మన వార్తా ఛానళ్ళే కాదు, భారతదేశపు ఛానళ్ళు అన్నీ ఇలానే నడుస్తాయి. వీటికి మించి సోషల్ మీడియా కృత్రిమ కన్నీరు కారుస్తోంది. ఈ సంఘటన జరిగి వుండకపోతే మన ఛానళ్ళు ఏవిషయం చర్చించి ఉండేవి? ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో టీవీ-5, ఏబిఎన్ చూడటానికి అవకాశం లేకుండా చేశారని అభియోగం. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఎమ్మెస్వోలను బెదిరించి ఈ ఛానళ్ళను ఆపారని విమర్శ!
అలా ఆపడం ప్రజాస్వామ్యబద్ధం కాదు. అవసరం లేదు. అలా చేసి ఏమీ సాధించలేరు. ఇప్పటికే ఆంగ్ల దినపత్రికల్లో సంపాదకీయాల ద్వారా విమర్శలకు గురయిన తర్వాత ఇలా చేయడం ఏమిటి? – ఇలాంటి తీరున సాగే వాదనలు ఒకవైపు వున్నాయి. అసలు మీడియాను ఎవరు పట్టించుకుంటున్నారు. తెలుగు మీడియా ఎన్నికల ముందు రాసిన విషయాలను పట్టించుకుని ఉంటే పోలింగ్ సరళి అలా ఉండేదా? సగటు మనిషికీ, మీడియా మేథావులకు దూరం చాలా ఉందని సాగే ధోరణి ఇంకోటి!
రాజకీయాలే కాదు మీడియా కూడా మేడిపండే! రాజకీయం అనే దాన్ని తొలిచి చూస్తే నాయకత్వం, వాణిజ్యం, స్వలాభం, పార్టీ, ప్రజాప్రయోజనం వంటివి పొరలు పొరలుగా కనబడతాయి. ఆ నాయకుల స్థాయినిబట్టి ఈ పొరల మందం ఉంటుంది. కొన్నిచోట్ల కొన్ని పొరలు అసలే ఉండకపోవచ్చు. లేదా అదనంగా మరికొన్ని ఉండవచ్చు. మీడియాలో సైతం గమనిస్తే సమాచారం, సంచలనం, స్వార్థం, రాజకీయ ప్రయోజనం, ప్రజాస్వామ్యం, విలువలు అనేవి పొరలు పొరలుగా వుంటాయి తరచిచూస్తే! అయితే లాఘవం శృతి మించితే మరికొన్ని అదనపు (దుర్) గుణాలు కూడా అంతర్గతంగా ఉండవచ్చు.
గతంలో చంద్రబాబు హయాంలో సాక్షి, ఎన్.టి.వీలకు ఇబ్బందులు కల్గించడం; ఇపుడు జగన్మోహనరెడ్డి పేర ఎబిఎన్, టీవీ-5లకు సంబంధించిన వార్తలు రావడం ఒకపూట పరిణామాలు కాదు. ప్రజలకు చేరడం, ప్రజాభిప్రాయాన్ని మలచడం అనే సౌలభ్యం ఒక వనరుగా మీడియా యాజమాన్యాలకు మారిపోయినప్పటి నుంచి ఈ సమస్య మొదలైంది. సమాజం మనోగతం ప్రభావితం చేయగలమని స్పష్టం కాగానే మీడియా యజమానులకు ప్రజోపయోగ దృష్టికన్నా రాజకీయ దృష్టి, మరింత సంపద గడించాలనే ధోరణి మొదలవుతుంది. దీన్ని గమనించిన వాణిజ్యవేత్తలు రాజకీయదృష్టితో మీడియాలో ప్రవేశిస్తారు. ఇప్పుడు ఈ రెండో వర్గం వారే ఎక్కువ ఉండవచ్చు. దాంతో మీడియా విపత్తులు ముందు ముందు మరిన్ని వస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అంటే మీడియా ద్వారా నడిపే రాజకీయమే. కొత్త ప్రభుత్వం వంద రోజుల విజయాలు అంటూ చేసుకొనే ప్రచారాన్ని దెబ్బ తీయడానికి సరిగ్గా అదే సమయంలో ప్రతిపక్షం ఛలో ఆత్మకూరు అని సిద్ధమైంది. దాంతో ఇరుపక్షాలలో అలికిడి, ప్రకటనలు, అరెస్టులు, విమర్శలు ఇలా సాగుతోంది.
సరిగ్గా పుష్కరం క్రితం ఆంధ్రప్రదేశ్ మీడియా పరిస్థితిలాగా ఇప్పుడు తయారవుతోంది. మీడియా రెండు శిబిరాలుగా విడిపోయి కత్తులు చాస్తోంది. అయితే ఇది ఇప్పట్లో ఆగిపోయే పరిస్థితి లేదు. మీడియా మెరుగైతే రాజకీయాలు శుభ్రమవుతాయి. ప్రజల విషయాలను మీడియా అసలు పట్టించుకుని ప్రభుత్వాలకు దిశానిర్దేశనం చేయాలి. ప్రజలపక్షం అని చెబుతూ స్వప్రయోజనాల పై దృష్టి ఉంచితే విమర్శలు తప్పవు.
బొంబాయి తాజ్ హోటల్లో విద్రోహచర్యలు జరిగినపుడు మీడియా యాజమాన్యాలు తమ న్యూస్ ఛానళ్ళు ఇటీవలే మొదలైనవీ, బాలారిష్ట దోషాలనీ, తప్పులు సహజం అని సమర్థించుకోవడం కానీ; టీఆర్పీల కోసం సంచలనాలు చేస్తూ వార్తా ఛానళ్ళు సాగవచ్చనే తెలుగు మీడియా యజమాని ధోరణి కానీ సమర్ధనీయం కాదు.
ఇది మీడియా కాలమ్ మాత్రమే కనుక మీడియా బాగోగులు లోతుగా చర్చిస్తాం. అయితే మీడియాను ప్రజలు పట్టించుకోనప్పుడు; పార్టీలు, ప్రభుత్వాలు తమకు నచ్చని ఛానళ్ళను పట్టించుకోకపోతే మంచిది కదా?
డా. నాగసూరి వేణుగోపాల్