అమరావతి: రాష్ట్రంలో శాసనసభ స్థానాలకూ, లోక్సభ సీట్లకూ పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా ఎన్నికల కోడ్ కాష్టం రగులుతూనే ఉంది. ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం వైఖరే ఇందుకు ప్రధాన కారణమని చెప్పక తప్పదు. చంద్రబాబు అధికారాలు లేని సిఎం అంటూ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం దగ్గర నుంచి టిటిడి బంగారం వ్యవహారంపై విచారణకు ఆదేశించడం వరకూ ఆయన ధోరణి విపరీతంగానే ఉంది.
తమ ఆదేశాలకు అనుగుణంగా ఇంటిలిజెన్స్ డిజి ఎ.బి.వెంకటేశ్వరరావు బదిలీకి వెంటనే ఉత్తర్వులు ఇవ్వనందుకు ప్రధాన కార్యదర్శి అనిల్ పునేఠాను ఆ పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో సుబ్రమణ్యంను ఎన్నికల కమిషన్ నియమించింది.. ఈ నియామకానికి ముందు రాష్ట్రప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకపోవడం చంద్రబాబుకు ఆగ్రహం కలిగించింది. వైఎస్ జగన్ నిందితుడుగా ఉన్న కేసులో సహ నిందితుడిగా ఉన్న వ్యక్తిని ప్రధాన కార్యదర్శి పదవిలో ఎలా నియమిస్తారని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు.
అక్కడ నుంచి రాజుకుంది. చంద్రబాబు ఆ మాటలు అనడం ఆయన నిర్వహిస్తున్న పదవికి తగినవి కావు. కానీ చంద్రబాబు రాజకీయ నాయకుడు. ఆయన ఏం మాట్లాడినా చెల్లుతుంది. ఎందుకంటే ఆయన ప్రజలకు జవాబుదారీ. ముఖ్యమంత్రి వ్యవహారశైలి సరిగా లేకపోతే ప్రజలే ఆయనను శిక్షిస్తారు. సుబ్రమణ్యం విషయం అందుకు భిన్నం. ఆయన ఐఎఎస్ అధికారి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి లోబడి పని చేయాలి. నువ్వు నన్ను తిట్టావు కాబట్టి నేను నీ దగ్గరకు రాను అని ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లకుండా భీష్మిస్తానంటే కుదరదు.
ఫోని తుపాను ఒదిషా రాష్ట్రం మీదుగా వెళ్లినా, ఉత్తరాంధ్ర జిల్లాలపై కూడా దాని ప్రభావం పడింది. ఇలాంటి ప్రాకృతిక విపత్తులు సంభవించినపుడు వాటిని ఎదుర్కొనే విషయంలో కానీ, సహాయక చర్యల విషయంలో కానీ రాజకీయ నాయకత్వం పర్యవేక్షణ ఉన్నపుడే అందరూ కలిసివస్తారు. పనులు జరుగుతాయి. ఫోని విషయంలో గవర్నర్కు రిపోర్టు చేసిన ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి సమీక్షకు రాకపోవడం అవిధేయత తప్ప మరోటి కాదు.
ప్రజాప్రభుత్వం అయిదేళ్లు పాలించిన తర్వాత సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొంటున్నపుడు ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ రాలేదు. అయిదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుని ఎన్నికలకు వెళ్లిన ముఖ్యమంత్రిని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అనడం ఇప్పుడే వింటున్నాం. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ముఖ్యమంత్రి శుభ్రంగా పాలన చేస్తున్నారు. ఆయన సమీక్షలకు ప్రధాన కార్యదర్శి సహా అధికారులు అందరూ హాజరవుతున్నారు. అక్కడ లేని కోడ్ ఇక్కడ ఎందుకుందన్న చంద్రబాబు ప్రశ్నను ఎన్నికల కమిషన్ గాలికి వదిలేసింది. దీనిని బట్టి ఎన్నికల కమిషన్నుంచి ఎలాంటి ఇబ్బందీ రాదులే అన్న ధీమా ఉండబట్టే సుబ్రమణ్యం ముఖ్యమంత్రిని ఖాతరు చేయడంలేదని అనుకోవాల్సి వస్తున్నది. వచ్చేవారం మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తాను ఏ కోడ్ అడ్డం వస్తుందో చూస్తాను అని చంద్రబాబు శుక్రవారం ప్రకటించారు. ఈ ఘర్షణ ఎక్కడికి వెళుతుందో చూడాలి.