అమరావతి: తనకు నచ్చిన అఖిల భారత సర్వీసు అధికారులను ఆంధ్రప్రదేశ్కు రప్పించాలన్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రయత్నాలకు కేంద్రం మోకాలడ్డుతోంది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు అధికారులు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఏర్పడటంతో ఇక్కడకు వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
తెలంగాణ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, ఐపిఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రలు ఆంధ్రప్రదేశ్కి వెళతామని ఇప్పటికే కెసిఆర్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ధర్మారెడ్డి కూడా ఏపి క్యాడర్కు డిప్యుటేషన్పై బదిలీ చేయాలని కోరుతున్నారు. వీరు ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని కలిశారు. వీరిని ఏపికి కేటాయిస్తే వెంటనే ప్రాధాన్యత పోస్టుల్లో నియమించేందుకు జగన్ సుముఖత వ్యక్తం చేశారు. అయితే వీరి డిప్యూటేషన్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఒపిటి) అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వీరికి అనుమతి ఇస్తే భవిష్యత్తులో మరి కొంత మంది బ్యూరోక్రాట్లు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని భావిస్తుండటంతో ఈ ప్రక్రియ ఆలస్యం అవుతోంది.
ఈ నేపథ్యంలో ఇటీవల సిఎం జగన్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కలిసిన సందర్భంలో బ్యూరోక్రాట్ల అంతరాష్ట్ర డిప్యూటేషన్ వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. కేంద్రం అభ్యంతరాల దృష్ట్యా కనీసం స్టీఫెన్ రవీంద్రకైనా ముందుగా అవకాశం ఇవ్వాలని జగన్ కోరినట్లు తెలుస్తోంది. శ్రీలక్మి, ధర్మారెడ్డి విషయంలో కేంద్రంతో మరో సారి సారి చర్చలు జరిపే అవకాశం ఉంది. స్టీఫెన్ రవీంద్రకు కేంద్రం నుండి అనుమతి రాగానే ఏపి ఇంటెలిజెన్స్ ఛీఫ్గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వీరి డిప్యూటేషన్ వ్యవహారం ఆలస్యం అవుతున్నందున సిఎం జగన్ మరో మారు కేంద్రంలో పెద్దలతో మాట్లాడే అవకాశం ఉందని భావిస్తున్నారు.