(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. తాము అధికారంలోకి వస్తే ఏపీలోని ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తామని సార్వత్రిక ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై వడివడిగా అడుగులు పడుతున్నాయి. జిల్లాల పునర్విభజన చేసి వచ్చే జనవరి 26 నుంచి కొత్త జిల్లాలను అమల్లోకి తీసుకురావాలని జగన్ సర్కార్ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఏపీలో 13 జిల్లాలు ఉండగా.. కొత్తగా మరో పన్నెండు జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 25కు చేరనుంది.
మరోవైపు ఈ విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో మాట్లాడినట్లు తెలిసింది. రాష్ట్రంలో ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలని భావిస్తున్నట్లు వివరించినట్లు సమాచారం. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రజలకు అందించే సేవలను మరింత దగ్గర చేసేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై గవర్నర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. నాలుగు నెలల్లోపు కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తును పూర్తిచేసి.. జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాడే అమల్లోకి తీసుకురావాలని జగన్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
కొత్త జిల్లాల ఏర్పాటు పరిశీలనలో భాగంగా రెవెన్యూ శాఖ వివరాలు కోరుతోంది. ముఖ్యంగా జిల్లా, రెవెన్యూ మండలాల వారీగా ఉన్న జనాభా, ఇతర సమాచారాన్ని వెంటనే పంపాలని కలెక్టర్లను కోరినట్టు సమాచారం. రాష్ట్రంలో మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఉన్నవాటి స్వరూపాన్ని మార్చాల్సి ఉంటుంది.
తెలంగాణలో సీఎం కేసీఆర్ పది జిల్లాలను విభజించి.. 33 జిల్లాలను ఏర్పాటు చేశారు. అయితే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మాత్రం గత ఐదేళ్లలో కొత్త జిల్లాల ఏర్పాటు జోలికి వెళ్లలేదు. పరిపాలనా సౌలభ్యం కోసమే తెలంగాణ తరహాలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలను సాధ్యమైనంత తొందరగా ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందనేది తెలియనప్పటికీ.. ఫైళ్లు మాత్రం చకచకా కదులుతున్నాయని తెలుస్తోంది.