న్యూఢిల్లీ: బిజిపి నాయకత్వం లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి వైసిపికి ఇవ్వజూపిందన్న ఊహాగానాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తోసిపుచ్చారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన జగన్ శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
అరగంట సేపు భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, డిప్యూటీ స్పికర్ విషయంలో తమకు ఎవరూ ఎలాంటి ప్రతిపాదనా చేయలేదని జగన్ పేర్కొనారు. హోంమంత్రితో చర్చలలో ఆ విషయమే ప్రస్తావనకు రాలేదని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ‘అమిత్ షాకు కూడా విజ్ఞప్తి చేశాం, ప్రధానికి మీరూ ఒకమాట చెప్పండని కోరాను. ప్రధాని మనసు కరిగేట్లు చేయండని కోరాను’ అని జగన్ పేర్కొన్నారు. విభజన చట్టం హామీల అంశాలన్నీ హోంశాఖ పరిధిలోకి వస్తాయి కాబట్టి ఆయనతో చర్చించామనీ, రేపు నీతి ఆయోగ్ సమావేశంలో కూడా ప్రస్తావిస్తామనీ జగన్ అన్నారు. ఢిల్లీ వచ్చినప్పుడల్లా ప్రత్యేకహోదా గురించి అడుగుతూనే ఉంటానని ఆయన అన్నారు. హోంమంత్రితో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు పార్లమెంటు సభ్యులు విజయసాయి రెడ్డి, మిధున్ రెడ్డి, అవినాష్ రెడ్డి పాల్గొన్నారు.