అమరావతి: ప్రజాసంకల్ప పాదయాత్ర సమయంలో వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చర్యలు చేపడుతున్నారు. ముందుగా సామాజిక పించన్ పెంచిన వైఎస్ జగన్ రెండు రోజుల క్రితం వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీ మేరకు వారి గౌరవ వేతనాన్ని మూడు వేల రూపాయల నుండి పదివేల రూపాయలకు పెంచారు. తాజాగా గురువారం నిర్వహించిన వ్యవసాయ శాఖ సమీక్షలో రైతులకు 12,500 రూపాయలు ఇచ్చే రైతు భరోసా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆక్టోబర్ 15నుండి ప్రారంభిస్తున్నట్లు సిఎం జగన్ ప్రకటించారు.
నకిలీ విత్తనాల చలామణీపై సిఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలనీ, అక్రమాలకు పాల్పడిన వారిని జైలుకు పంపడానికి కూడా వెనుకాడవద్దని అన్నారు. దీనిపై విత్తన చట్టం తేవాలని అధికారులు సూచించగా అవసరమయితే అసెంబ్లీలో చర్చించి చట్టం తెద్దామని సిఎం జగన్ పేర్కొన్నారు. రైతులు వినియోగించే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీ గ్రామ సచివాలయాల ద్వారా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సిఎం జగన్ ఆదేశించారు. రైతులకు ప్రభుత్వ సేవలపై విశ్వసనీయత పెంచాలని జగన్ సూచించారు. అవినీతి జరిగితే ఎవరినీ క్షమించేది లేదని సిఎం జగన్ హెచ్చరించారు. అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలనీ, ఉత్తమమైన సలహాలు ఇస్తే సంతోషించడంతో పాటు వారికి సన్మానాలు కూడా చేస్తామని సిఎం జగన్ అన్నారు.
రైతులకు భీమా సౌకర్యం సక్రమంగా అందించే పూర్తి బాధ్యత ఇక ప్రభుత్వానిదేననీ, ప్రీమియం కూడా పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని జగన్ చెప్పారు. పరిష్కారాలు వంద శాతం ఉండాలని సిఎం జగన్ సూచించారు.
రైతులకు కనీస మద్దతు ధర సంపూర్ణంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మూడు వేల కోట్ల రూపాయలతో మార్కెట్ స్థిరీకరణ నిధిని బడ్జెట్లో పెడతామనీ, రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ఈ నిధి ద్వారా ప్రభుత్వం అండగా ఉంటుందని సిఎం జగన్ తెలిపారు.
సమావేశంలో ముఖ్య సలహాదారు అజెయ కల్లం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పివి రమేష్, వ్యవసాయ శాఖ సలహాదారు విజయ్కుమార్, ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ మురళీధర్ రెడ్డిలు పాల్గొన్నారు.