న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రాధామ్యాలు ఏమిటో అందరికీ తెలిసినవే అయినా ఈరోజు క్యాబినెట్ కమిటీల కూర్పులో ఆ విషయం స్పష్టంగా బయటపడింది. రాజనాధ్ సింగ్ పేరుకే రెండవ స్థానంలో ఉన్నారని మరోసారి స్ఫష్టమైంది. మోదీ కూర్చిన ఈ కమిటీలు అన్నిటిలో హోంమంత్రి అమిత్ షాకు చోటు దొరికింది.
గత మోదీ ప్రభుత్వంలో హోంశాఖ నిర్వహించిన రాజనాధ్ సింగ్ను రెండు కమిటీలలో మాత్రమే నియమించారు. అన్నిటి కన్నా ముఖ్యంగా అత్యంత ప్రధానమైన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీలో రాజనాధ్ సింగ్కు చోటు దొరకలేదు. విధాన నిర్ణయాలు తీసుకునే ఈ కమిటీలో నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, నరేంద్ర తోమర్, రవిశంకర్ ప్రసాద్, హర్షవర్ధన్, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, రామ్ విలాస్ ఫాశ్వాన్, హరిసిమ్రత్ కౌర్ బాదల్, అరవింద్ సావంత్ సభ్యులుగా ఉన్నారు.
మొత్తం ఎనిమిది కమిటీలలో నిర్మలా సీతారామన్ ఏడింటిలో, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అయిదింటిలో ఉన్నారు. ప్రధాని తర్వాత ప్రమాణస్వీకారం చేసే మంత్రి క్యాబినెట్లో రెండవ స్థానంలో ఉన్నట్లు లెక్క. సాధారణంగా ప్రధాని లేనపుడు ఆ మంత్రే రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రాజనాధ్ సింగ్ రెండవ స్థానంలో ప్రమాణ్వీకారం చేసినప్పటికీ ఆయనకు ఆ కమిటీలో సభ్యత్వమే లేకుండా చేశారు.