న్యూఢిల్లీ: మొబైల్స్పై వాట్సాప్ నిఘాకు సంబంధించిన రాజకీయ వివాదం తీవ్రంగా మారుతున్నది. ప్రతిపక్షాల నాయకులపై నిఘా పెట్టారన్న ఆభియోగాలు మొదలయ్యాయి. ఇజ్రాయెలీ స్పైవేర్ పెగాసస్ ద్వారా ఇండియాలో మొబైల్ పోన్ల హ్యాకింగ్ జరిగిన విషయం బయటకు వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ఫోన్ కూడా హ్యాకింగ్కు గురయిందని సంచలన ప్రకటన చేశారు. తాజాగా తమ నాయకురాలు ప్రియాంకా గాంధీ మొబైల్ కూడా హ్యాక్ అయిందని కాంగ్రెస్ మరో సంచలన ప్రకటన చేసింది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కేంద్రమంత్రి ప్రఫుల్ పటేల్ కూడా తన ఫోన్ హ్యాక్ అయినట్లు తెలిపారు.
ఫోన్లు హ్యాంకింగ్ అయిన వారందరికీ ఆ విషయం తెలియపరుస్తూ వాట్సాప్ మెసేజ్లు పంపిందనీ, అలాంటి మెసేజ్ ప్రియాంకకు కూడా వచ్చిందనీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణజీప్ సింగ్ సూర్జేవాలా ఆదివారం మీడియాకు చెప్పారు.
ప్రియాంక గాంధీ దానిని పట్టించుకోలేదనీ, వెంటనే మెసేజ్ డిలీట్ చేశారనీ ఆమె టీమ్ సభ్యులు తెలియజేశారు. హ్యాంకింగ్ బాధితులకు వచ్చిన మెసేజ్ ఒకదాన్ని రణదీప్ సూర్జేవాలా ఆమెకు పంపినపుడు తనకు కూడా అలాంటిది వచ్చిందన్న విషయం ఆమెకు గుర్తుకు వచ్చిందనీ ఆ వర్గాలు చెప్పాయి.
ఈ హ్యాకింగ్ బిజెపి పుణ్యమేనని సూర్జేవాలా వ్యాఖ్యానించారు. బిజెపి అంటే భారతీయ జాసూస్ పార్టీ అని ఆయన అన్నారు. హ్యాకింగ్ చేయించింది బిజెపి కాబట్టి వారు మౌనంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో అబద్ధాలు చెబుతోందనీ, స్పైవేర్ దాడి గురించి వాట్సాప్ మే నెలలోనే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తే అక్టోబర్ వరకూ తమకు ఈ సంగతి తెలియదని బుకాయిస్తున్నదనీ సూర్జేవాలా పేర్కొన్నారు.