ఢిల్లీ: ఎన్నికలలో నామినేషన్ దాఖలు చేసిన ప్రతిసారీ విద్యార్హతలను రకరకాలుగా పేర్కొంటూ వచ్చిన కేంద్రమంత్రి సృతి ఇరానీ నామినేషన్ తిరస్కరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. తాజాగా అమేఠీ నియోజకవర్గానికి దాఖలు చేసిన నామినేషన్లో ఆమె తన డిగ్రీ పూర్తి కాలేదని తెలిపారు. గతంలో కూడా సృతి ఇరానీ విద్యార్హతలపై వివాదం తలెత్తింది.
‘ఇది జోక్ కాదు కాదు.తీవ్రమైన విషయం. ప్రజలను మోసం చేస్తున్నారు. ఇది వంచన, ఆమె నామినేషన్ను రద్దు చేయాలి. ప్రజాస్వామ్యాన్ని మోసం చేసే వ్యక్తికి పోటీ చేసే హక్కు లేదు.మోదీజీ, దేశాన్ని తరువాత కాపాడుదురు గాని. ముందు స్మృతి ఇరానీ డిగ్రీ గురించి తెలియజేయండి’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా డిమాండ్ చేశారు.
2017లో రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేసినపుడు కూడా సృతి ఇరానీ ఇదే విద్యార్హత ప్రకటించారు. కానీ 2014 ఎన్నికలలో అమేఠీకి నామినేషన్ వేసినపుడు, అంతకుముందు 2004 ఎన్నికలలో చందినీచౌక్ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ వేసినపుడు ఆమె ఇందుకు భిన్నంగా రెండు రకాలుగా విద్యార్హతలను ప్రకటించారు.
కాంగ్రెస్ అధికారప్రతినిధి ప్రియాంకా చతుర్వేది కూడా సృతి ఇరానీ విద్యార్హతలపై చెణుకు విసిరారు. రాజకీయాలలోకి రాకముందు సృతి టివి సీరియల్స్లో నటించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆమెను ‘సీరియల్ అబద్దాలకోరు’గా వర్ణించారు.