(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
తెలంగాణలో రాజకీయాలు క్షణక్షణం మారుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారా? అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లనున్నారా ? ఇప్పుడు ఇదే అంశంపై తెలంగాణ రాజకీయవర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరగ్గా.. తాజాగా ఆయన కారెక్కనున్నారని పుకార్లు వస్తున్నాయి.
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్రావుతో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీ లాబీలో హరీశ్తో ఆయన సుమారు అరగంటపాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ మార్పుపై ఇద్దరి మధ్య చర్చకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, గత కొంత కాలంగా నిలిచిపోయిన పలు బిల్లులకు సంబంధించిన అంశాలపై రాజగోపాల్ రెడ్డి హరీశ్ తో చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. హరీశ్ ఆర్థిక శాఖ మంత్రి కావడంతో పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని కోరినట్లు తెలుస్తోంది. పార్టీ మార్పు అంశం చర్చకు రాలేదని సమాచారం.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ తరఫున మునుగోడు నుంచి పోటీ చేసి గెలుపొందారు. గత కొద్ది రోజులుగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ యూటర్న్ తీసుకున్న రాజగోపాల్ రెడ్డి.. తాను కాంగ్రెస్లోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. అయితే, తాజాగా మంత్రి హరీశ్తో భేటీ కావడంతో కోమటిరెడ్డి కారుక్కుతారనే పుకార్లు వస్తున్నాయి. ఈ ఇద్దరి భేటీ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరిలో సబితా ఇంద్రారెడ్డి ఏకంగా మంత్రి కూడా అయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో 6 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. తమ సభ్యుల సంఖ్య ఆరుకి పడిపోడంతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. తాజాగా కోమటిరెడ్డి కూడా పార్టీ మారితే.. ఆ సంఖ్య ఐదుకి పడిపోనుంది. అయితే కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా? లేదంటే పార్టీ మారతారా? అసలు ఆయన మనసులో ఏముంది ? అన్నది మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.