న్యూఢిల్లీ: రామజన్మభూమి బాబరీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి తాము సుముఖమేనని కాంగ్రెస్ ప్రకటించింది. అన్ని రాజకీయ పార్టీలూ, అన్ని వర్గాల ప్రజలూ శాంతి సామరస్యాలను కాపాడాలని కాంగ్రెస్ కోరింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో జస్టిస్ ఎస్ఎ బాబ్డే, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్తో కూడిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం శనివారం ఇచ్చిన ఏకగ్రీవ తీర్పులో వివాదస్థలాన్ని రామలల్లాకు అప్పగించింది. అక్కడ అయోధ్య ట్రస్టు ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం జరగాలని కోర్టు ఆదేశించింది. వివాదస్థలం వెలుపల మసీదు నిర్మాణానికి అయిదు ఎకరాల స్థలం అప్పగించాలని కోర్టు పేర్కొన్నది.
అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.